మూడో రోజు పూర్తిగా చేతులెత్తేసిన భారత బ్యాటింగ్, బౌలింగ్ దళాలు నాలుగో రోజు కూడా ఇబ్బంది పడ్డాయి. దీనికి తోడు ఫీల్డర్ల తప్పిదాలు సఫారీ జట్టుకు కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే కీగన్ పీటర్సన్ (82) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికాను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. మూడో రోజు చివర్లో సఫారీ కెప్టెన్ ఎల్గార్ అవుటైన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మరో వికెట్ కోసం భారత బౌలర్లు చెమటోడ్చారు. ఈ మధ్యలో అర్ధశతకం పూర్తి చేసుకున్న కాసేపటికే పీటర్సన్ సులభమైన క్యాచ్ ఇచ్చాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్లో ఉన్న పుజారా చేతుల్లోకి వెళ్లింది. అయితే తత్తరపడిన పుజారా ఆ క్యాచ్ నేలపాలు చేశాడు.
అంత సులభమైన క్యాచ్ కూడా వదిలేయడాన్ని బౌలింగ్ చేసిన బుమ్రా నమ్మలేకపోయాడు. ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కువెళ్లాడు. ఆ తర్వాత వాన్ డర్ డస్సెన్ (18 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన పీటర్సన్ సఫారీ జట్టును విజయానికి చేరువ చేశాడు.
అయితే బౌలింగ్కు వచ్చిన శార్దూల్.. ఆఫ్స్టంప్ మీదకు వేసిన లెంగ్త్ బాల్ను ఆడేందుకు పీటర్సన్ ప్రయత్నించాడు. దీంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లకు తగిలింది. ఎట్టకేలకు భారత జట్టుకు మరో వికెట్ దక్కింది. జట్టు స్కోరు 155 వద్ద సఫారీలు మూడో వికెట్ కోల్పోయారు.