రెండో టెస్టులో భారత జట్టు ఏమాత్రం ఆధిత్యం చెలాయించలేకపోయింది. సఫారీ బౌలర్ల ధాటికి తొలి రోజు కూడా పూర్తిగా ఆడని టీమిండియా.. 202 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50), అశ్విన్ (46) రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
మయాంక్ అగర్వాల్ (26), హనుమ విహారి (20), పంత్ (17) ఆకట్టుకోలేకపోయారు. ఇక వెటరన్లు పుజారా (3), రహానే (0) మరోసారి విఫలమవగా.. యువ ఆల్రౌండర్ శార్దూల్ (0) నిరాశపరిచాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ధాటిగా ఆడుతూ కనిపించిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. హాఫ్ సెంచరీకి బౌండరీ దూరంలో పెవిలియన్ చేరాడు. 50 బంతుల్లో 46 పరుగులు చేసిన అశ్విన్.. మార్కో జాన్సెన్ బౌలింగ్లో షార్ట్ పిచ్ బంతికి వికెట్ పోగొట్టుకున్నాడు.
షార్ట్ బాల్ వస్తుందని ముందుగానే ఊహించిన అశ్విన్ ఒక అడుగు వెనక్కు వేసి పాయింట్ మీదుగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అతను ఊహించిన దాని కన్నా మరీ ఎక్కువగా పైకి ఎగరిన బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దీంతో పాయింట్ ఫీల్డర్ పీటర్సన్కు చాలా సులభమైన క్యాచ్ దక్కింది.
ఈ క్యాచ్తో అశ్విన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ (50) తర్వాత టాప్ స్కోరర్ అశ్వినే. ప్రస్తుతం క్రీజులో బుమ్రా, సిరాజ్ ఉన్నారు. రబాడ వేసిన 62వ ఓవర్లో బుమ్రా (14) ఫోర్, సిక్స్, ఫోర్తో చెలరేగడంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది.
అయితే 64వ ఓవర్ తొలి బంతికి సిరాజ్ (1) వికెట్ తీసిన రబాడ.. భారత ఇన్నింగ్స్ ముగించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో రాహుల్, చివర్లో అశ్విన్ రాణించడంతో భారత జట్టు 202 పరుగుల స్కోరు చేసింది. సఫారీ బౌలర్లలో జాన్సెన్ 4, రబాడ 3, ఆలివియర్ 3 వికెట్లు పడగొట్టారు.