IND vs SA: ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 37వ లీగ్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (40), శుభ్మన్ గిల్ (23) ల మెరుపు ఆరంభాన్ని తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇరువురూ అర్థ సెంచరీలు పూర్తిచేసి ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు షాట్లతో అలరిస్తున్నాడు. కోహ్లీ, శ్రేయస్లు క్రీజులో ఉండటం చేతిలో వికెట్లు ఉండటంతో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసే దిశగా సాగుతోంది.
రోహిత్ వీరబాదుడుతో పది ఓవర్లకే 91 పరుగులు చేసిన భారత్.. గిల్ నిష్క్రమణతో కాస్త నెమ్మదించింది. కానీ శ్రేయస్, కోహ్లీలు క్రీజులో కుదురుకున్నా బ్యాట్కు పనిచెప్పారు. 67 బంతుల్లో కోహ్లీ అర్థ సెంచరీ పూర్తయింది. మార్కో జాన్సెన్ వేసిన 31 వ ఓవర్లో శ్రేయస్.. తొలి బంతిని బౌండరీకి తరలించి ఫిఫ్టీ పూర్తిచేశాడు. అదే ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. 37 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ భారత్.. 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కానీ ఎంగిడి వేసిన 37వ ఓవర్లో భారీ షాట్ ఆడిన అయ్యర్.. మార్క్రమ్ చేతికి చిక్కడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లీ – అయ్యర్లు మూడో వికెట్కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (68 నాటౌట్)తో పాటు కెఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.