కాన్పూర్ వేదికగా కివీస్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అక్షర్ పటేల్ చెలరేగుతున్నాడు. రెండో రోజు ఆటలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లు.. మూడో రోజు పట్టుబిగించారు. ఈ క్రమంలోనే స్పిన్నర్ అక్షర్ పటేల్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
న్యూజిల్యాండ్ వెటరన్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ (11)ను ముందుగా పెవిలియన్ చేర్చిన అతను.. ఆ తర్వాత హెన్నీ నికోల్స్ (2)ను ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ వెంటనే భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని సెంచరీకి చేరువైన కివీ ఓపెనర్ టామ్ లాథమ్ (95)ను వెనక్కిపంపాడు.
అనంతరం వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ టామ్ బ్లండెల్ (13), టిమ్ సౌథీ (5) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అతనే కాకుండా అశ్విన్, జడేజా, ఉమేష్ యాదవ్ కూడా తలో వికెట్ తీసుకున్నారు. దీంతో 132 ఓవర్లకు కివీస్ 277/8 స్కోరుతో నిలిచింది. మరో రెండు వికెట్లు కోల్పోతే వారి ఇన్నింగ్స్ ముగుస్తుంది.