Yashasvi Jaiswal | స్వదేశంలో తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్లో 655 పరుగులు చేసి పాత రికార్డుల దుమ్ము దులుపుతున్న 22 ఏండ్ల ఈ ముంబై బ్యాటర్.. ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐదో టెస్టులో మరో ఆల్ టైమ్ రికార్డుపై కన్నేశాడు. ఐదో టెస్టులో గనక జైస్వాల్.. 98 పరుగులు చేయగలిగితే అతడు భారత్ – ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో హయ్యస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా నిలుస్తాడు. తద్వారా మూడు దశాబ్దాల క్రితం ఇంగ్లండ్ బ్యాటర్ గ్రాహం గూచ్ నెలకొల్పిన రికార్డు బ్రేక్ అవనుంది.
34 ఏండ్ల రికార్డుపై గురి..
భారత్ – ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్లో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు (వ్యక్తిగత) చేసిన బ్యాటర్ గ్రాహం గూచ్. ఆయన 1990లో మూడు మ్యాచ్లు ఆడి 6 ఇన్నింగ్స్లలో ఏకంగా 125.33 సగటుతో 752 పరుగులు సాధించాడు. 34 ఏండ్లు అయినా ఈ రికార్డు చెక్కు చెదరేలేదు. విరాట్ కోహ్లీ, జో రూట్లు కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. జో రూట్.. 2021-22 ఇండియాతో స్వదేశంలో జరిగిన సిరీస్లో ఐదు టెస్టులు ఆడి (9 ఇన్నింగ్స్లలో) 737 రన్స్ చేశాడు. ఈ జాబితాలో జైస్వాల్ మూడో స్థానంలో ఉన్నాడు. జైస్వాల్.. తాజా సిరీస్లో 4 టెస్టులలో 8 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్కు వచ్చి 93.57 సగటుతో 655 రన్స్ చేశాడు.
ధర్మశాల టెస్టులో మరో 83 పరుగులు చేస్తే జైస్వాల్.. రూట్ రికార్డును అధిగమిస్తాడు. ఇక మరో 98 రన్స్ చేయగలిగితే గూచ్ రికార్డు కూడా కనుమరుగై భారత్ – ఇంగ్లండ్ మధ్య అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలుస్తాడు.
సన్నీ రికార్డుపై కన్ను…
ఈ రికార్డుతో పాటు ఐదో టెస్టులో మరో 120 పరుగులు చేయగలిగితే ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా జైస్వాల్ రికార్డులకెక్కుతాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. 1971లో వెస్టిండీస్తో ఆడుతూ 4 టెస్టుల సిరీస్లో 774 పరుగులు చేశాడు. రెండో స్థానంలో కూడా ఆయనే ఉండటం గమనార్హం. 1978-79లో అదే విండీస్తో ఆరు మ్యాచ్లు ఆడి 9 ఇన్నింగ్స్లలో 732 పరుగులు సాధించాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ.. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో 692 రన్స్ చేశాడు. జైస్వాల్.. ఇంగ్లండ్తో 4 టెస్టులలో 655 పరుగులు చేసిన విషయం తెలిసిందే.