కెప్టెన్గా ఆడుతున్నది తొలి మ్యాచే అయినా.. బుమ్రా తన ప్రదర్శనతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. బ్యాట్తో ఒకే ఓవర్లో 35 పరుగులు రాబట్టి చరిత్రకెక్కిన జస్ప్రీత్.. బంతితో నిప్పులు చెరిగి ఇంగ్లండ్ టాపార్డర్ను కకావికలం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో జడేజా సెంచరీకి బుమ్రా మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆనక బౌలింగ్లోనూ విజృంభించి.. మ్యాచ్పై పట్టు చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నది! ఆదివారం తొలి సెషన్లో బెయిర్స్టో, స్టోక్స్ను ఔట్ చేసి తొలి ఇన్నింగ్స్లో మంచి ఆధిక్యం సాధించగలిగితే టైగర్ పటౌడీ ట్రోఫీ టీమ్ఇండియా వశమైనట్లే!!
బర్మింగ్హామ్: పదే పదే వర్షం ఆటంకం కలిగిస్తున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వరుణుడి కారణంగా శనివారం దాదాపు రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోగా.. ఉన్నంతలో భారత్ అదరగొట్టింది. మొదట రవీంద్ర జడేజా (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) అద్వితీయ శతకానికి.. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లు ఎక్స్ట్రాల రూపంలో 40 పరుగులు సమర్పించుకోగా.. అందులో 17 నోబాల్స్ ఉండటం గమనార్హం. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. లీస్ (6), క్రాలీ (9), పోప్ (10), లీచ్ (0) విఫలం కాగా.. రూట్ (31) కాస్త పోరాడాడు. భారత బౌలర్లలో బుమ్రా 3, షమీ, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 5 వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. భారత స్కోరుకు 332 పరుగులు వెనుకబడి ఉంది. బెయిర్స్టో (12), స్టోక్స్ (0) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 338/7తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా మరో 78 పరుగులు చేసి 416 వద్ద ఆలౌటైంది. రవీంద్ర జడేజా టెస్టు కెరీర్లో మూడో శతకం పూర్తి చేసుకోగా.. అతడికి మహమ్మద్ షమీ (16) సహకరించాడు. వీరిద్దరూ 8వ వికెట్కు 48 పరుగులు జోడించారు. నాలుగు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కాగా.. ఆఖర్లో బుమ్రా రెచ్చిపోయాడు.
ఈ మ్యాచ్లో టీమ్ఇండియాకు సారథ్యం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రా.. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో బ్యాట్తో నయా చరిత్ర లిఖించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84వ ఓవర్లో బుమ్రా ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. ఇందులో 29 రన్స్ బ్యాట్ నుంచి రాగా.. మిగిలిన ఆరు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. తొలి బంతికి బుమ్రా ఫోర్ కొట్టగా.. వైడ్గా వేసిన రెండో బంతిని కీపర్ అందుకోలేకపోవడంతో 5 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి బంతి నోబాల్ కాగా.. దాన్ని బుమ్రా సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత వరుసగా 4,4,4,కొట్టిన బుమ్రా.. ఐదో బాల్ను స్కేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ అరుసుకున్నాడు. చివరి బంతికి సింగిల్ తీయడంతో ఒకే ఓవర్లో 35 పరుగులు భారత్ ఖాతాలో చేరాయి. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో బుమ్రా టాప్లో నిలువగా.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా (28 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ రికార్డు సృష్టించిన బుమ్రాపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆడుతున్నది యువరాజా.. లేక బుమ్రానా’అని సచిన్ పేర్కొంటే.. ‘పాపం బ్రాడ్కే ఎందుకు ఇలాంటి సంకట స్థితి ఎదురవుతుందో’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు (బ్యాట్తో 29, ఓవరాల్గా 35) సాధించిన ఆటగాడిగా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. విండీస్ దిగ్గజం లారా (28 పరుగులు; దక్షిణాఫ్రికా స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ ఓవర్లో) రెండో స్థానంలో ఉన్నాడు.
4,5వైడ్,7నోబ్, 4,4,4,6,1