IND vs ENG 3rd Test |భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజే భారత్ అదరగొట్టింది. తొలి సెషన్లో స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా టీమిండియా సారథి రోహిత్ శర్మ (196 బంతుల్లో 131, 14 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (212 బంతుల్లో 110 బ్యాటింగ్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తో పాటు అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ (66 బంతుల్లో 62, 9 ఫోర్లు, 1 సిక్సర్) దంచికొట్టడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 86 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆదిలోనే యశస్వి జైస్వాల్ (10) వికెట్ కోల్పోయింది. మార్క్ వుడ్ భారత్ను తొలిదెబ్బ తీశాడు. నాలుగో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయిన భారత్కు వుడ్ మరోఉ షాకిచ్చాడు. 9 బంతులాడి ఒక్క పరుగుకూడా చేయని శుభ్మన్ గిల్నూ పెవిలియన్కు పంపాడు. నాలుగో స్థానంలో వచ్చిన రజత్ పాటిదార్ (5)ను హర్ట్లీ ఔట్ చేశాడు. దీంతో భారత్.. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
రోహిత్ – జడ్డూ కీలక భాగస్వామ్యం..
33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ను సీనియర్ బ్యాటర్లు రోహిత్ – జడేజా ఆదుకున్నారు. తొలుత వికెట్లను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన ఈ జోడీ క్రీజులో కుదురుకున్నాక పరుగుల వేట మొదలుపెట్టింది. ఒక్కో పరుగు కూడాబెడుతూ మూడంకెల స్కోరు దిశగా కదిలిందీ ద్వయం. రెండో సెషనల్లో ఈ ఇద్దరూ నిలకడగా ఆడి స్కోరువేగాన్ని పెంచారు. ఇప్పటివరకు భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా జరిగిన సెషన్ ఇదే కావడం గమనార్హం. మూడో సెషన్ ఆరంభంలోనే రోహిత్ శతకం పూర్తిచేశాడు. టెస్టులలో రోహిత్కు ఇది 11వ శతకం. సెంచరీ తర్వాత సిక్సర్, రెండు ఫోర్లతో వేగంగా ఆడబోయిన రోహిత్ను మార్క్వుడ్ ఔట్ చేయడంతో 204 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
సర్ఫరాజ్ కేక..
రోహిత్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. అంచనాలకు మించి రాణించాడు. తొలి మ్యాచ్లోనే బెరుకు లేకుండా వేగంగా పరుగులు రాబట్టాడు. క్రీజులో కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడిన ఈ ముంబై ఆటగాడు.. ఆ తర్వాత మాత్రం జోరు పెంచాడు. ఓవర్కు ఓ బౌండరీకి తగ్గకుండా దూకుడు చూపాడు. ఈ క్రమంలో 48 బంతుల్లోనే అతడి అర్థ సెంచరీ పూర్తయింది. మూడంకెల స్కోరు దిశగా చురుగ్గా కదిలిన సర్ఫరాజ్.. రవీంద్ర జడేజా 99 పరుగుల వద్ద ఉండగా రన్ తీయబోయి నాన్ స్ట్రయికర్ ఎండ్లో వుడ్ డైరక్ట్ త్రో తో రనౌట్ అయ్యాడు. సర్ఫరాజ్ రనౌట్ అయ్యాక రెండో బంతికి జడేజా శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. జడేజాకు టెస్టులలో ఇది నాలుగో శతకం.. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్ మూడు వికెట్లు తీయగా హర్ట్లీ ఒక వికెట్ పడగొట్టాడు.