IND vs ENG 3rd Test | రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ను 445 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చి దంచుడు మంత్రాన్ని జపిస్తోంది. ఆ జట్టు ఓపెనర్ బెన్ డకెట్ (118 బంతుల్లో 133 నాటౌట్, 21 ఫోర్లు, 2 సిక్సర్లు) 88 బంతుల్లోనే శతకం చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు ఇరుసులా మారాడు. అతడితో పాటు ఉన్న కొద్దిసేపే అయినా ఒలీ పోప్ (55 బంతుల్లో 39, 5 ఫోర్లు, 1 సిక్సర్) కూడా వేగంగానే ఆడాడు. భారత్ ఆలౌట్ అయ్యాక రెండో రోజు 35 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 5.91 రన్రేట్తో 207 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది.
భారత్ను రెండో సెషన్లో ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. మూడో సెషన్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హైదరాబాద్, వైజాగ్ టెస్టులలో విఫలమైన డకెట్.. రాజకోట్లో మాత్రం రఫ్ఫాడించాడు. బంతిని బాదితే మినిమం ఫోర్ అన్న రేంజ్లో అతడి విధ్వంసం సాగింది. డకెట్ ఉతుకుడుకు కుల్దీప్ యాదవ్ (6 ఓవర్లలో 42 రన్స్), సిరాజ్ (10 ఓవర్లలో 54 రన్స్), జడేజా (4 ఓవర్లలో 33 రన్స్) భారీగా పరుగులిచ్చుకున్నారు.
ఓపెనర్ జాక్ క్రాలే (15)తో కలిసి తొలి వికెట్కు 89 పరుగులు జోడించిన డకెట్.. 39 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచాడు. 88 బంతులలోనే అతడి శతకం పూర్తయింది. ఇందులో 19 బౌండరీలు, ఒక సిక్సర్ కూడా ఉండటం గమనార్హం. క్రాలేను అశ్విన్ ఔట్ చేశాడు. టెస్టులలో అశ్విన్కు ఇది 500వ వికెట్. క్రాలేతో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించిన డకెట్.. రెండో వికెట్కు ఒలీ పోప్తో కలిసి 101 పరుగులు జతచేశాడు. వేగంగా ఆడుతున్న ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. అతడి బౌలింగ్లో పోప్ ఎల్బీగా నిష్క్రమించాడు. మూడో సెషన్లో ఇంగ్లండ్ 29 ఓవర్లలోనే 176 పరుగులు రాబట్టడం (6 రన్ రేట్తో) విశేషం. మరో మూడు రోజుల ఆట మిగిలున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఇంగ్లండ్ను ఎంత త్వరగా కట్టడి చేస్తే భారత్కు ఈ టెస్టులో పట్టుబిగించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.