IND vs ENG 1st Test: భారత్ – ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్లో త్వరగానే ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం భారత స్పిన్ త్రయాన్ని, బుమ్రా, సిరాజ్ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కుంటోంది. ఆ జట్టు యువ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 నాటౌట్, 17 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పోప్తో పాటు రిహాన్ అహ్మద్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు ఇప్పటికే 126 పరుగుల ఆధిక్యంలో ఉంది.
భారత్ను 436 పరుగులకు నిలువరించిన ఇంగ్లండ్.. సెకండ్ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. ఆ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (31), బెన్ డకెట్ (47)లు ధాటిగా ఆడి తొలి వికెట్కు 9 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. డకెట్ను బుమ్రా ఔట్ చేయగా క్రాలేను అశ్విన్ పెవిలియన్కు పంపాడు. ఇదే క్రమంలో భారత్.. జో రూట్ (2), జానీ బెయిర్ స్టో (10), బెన్ స్టోక్స్ (6) వికెట్లను పడగొట్టింది.
సహచర బ్యాటర్లు ఒక్కొక్కరుగా క్రీజును వీడుతున్నా పోప్ మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్లు జోరు మీదుండటంతో వికెట్ను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టాడు. 54 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన అతడు.. ఆ తర్వాత నెమ్మదించాడు. రెండో సెషన్లో ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ వికెట్ కోల్పోయాక అతడు మరింత జాగ్రత్తగా ఆడాడు. బంతి పాతబడేదాకా వేచి చూసిన అతడు.. మరో ఎండ్లో బెన్ ఫోక్స్ (81 బంతుల్లో 34, 2 ఫోర్లు) కుదురుకోవడంతో బ్యాట్కు పనిచెప్పాడు. 154 బంతుల్లో సెంచరీ పూర్తిచేసిన పోప్.. ఫోక్స్తో ఆరో వికెట్కు 112 పరుగులు జోడించాడు.
A remarkable hundred from Ollie Pope 🤩#WTC 25 | #INDvENG pic.twitter.com/KpXsweZNu7
— ICC (@ICC) January 27, 2024
అక్షర్ పటేల్ బౌలింగ్లో ఫోక్స్ ఔట్ అయినా రిహాన్ తో కలిసి ఇంగ్లండ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. పోప్ శతకంతో ఈ టెస్టు రసవత్తరంగా సాగనుంది. ఆదివారం (టెస్టు నాలుగో రోజు) ఉదయం సెషన్లోనే ఇంగ్లండ్ను ఎంత త్వరగా ఆలౌట్ చేస్తే భారత్కు అంత మంచిది. బంతి పాతబడేకొద్దీ పిచ్ బ్యాట్కు అనుకూలిస్తుండటం రెండో ఇన్నింగ్స్లో భారత్కు కలిసొచ్చేదే…!