భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన స్టీవ్ స్మిత్ (35) ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని స్కూప్ ఆడేందుకు ప్రయత్నించిన స్మిత్.. అది కుదరదని అర్థం కావడంతో డీప్ థర్డ్ వైపు బంతిని పంపాలని ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. ఈ బంతిని అందుకున్న డీకే అప్పీల్ చేశాడు. అంపైర్ అవుటివ్వకపోవడంతో రోహిత్ రివ్యూ కోరాడు.
రిప్లేలో బంతి.. బ్యాటును తాకినట్లు తేలడంతో స్మిత్ కూడా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి గ్లెన్ మ్యాక్స్వెల్ (1)ను కూడా ఉమేష్ అవుట్ చేశాడు. ఉమేష్ వేసిన షార్ట్ బాల్ను పాయింట్ మీదుగా బాదేందుకు మ్యాక్స్వెల్ ప్రయత్నించి మిస్ అయ్యాడు. ఈ బంతిని అందుకున్న డీకే మరోసారి అప్పీల్ చేశాడు. అంపైర్ అవుటివ్వలేదు. రివ్యూ కోరేందుకు రోహిత్ సంకోచించగా.. డీకే కచ్చితంగా బ్యాటును బంతి తాకిందని చెప్పాడు. దీంతో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బ్యాటును బంతి తాకినట్లే తేలింది. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ జట్టు 123/4 స్కోరుతో నిలిచింది.