IND vs AUS : ఢిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ 262 రన్స్ వద్ద ఆలౌట్ అయింది. పర్యాటక ఆస్ట్రేలియాకు ఒక పరుగు ఆధిక్యం లభిచింది. కుహ్నేమాన్, షమీని బౌల్డ్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. కొత్త బంతి తీసుకున్న ఆసీస్ రవిచంద్రన్ ఆశ్విన్ (37), అక్షర్ పటేల్ (74)ను వెంట వెంటనే ఔట్ చేసింది. మర్ఫీ ఓవర్లో సిక్స్ బాదిన అక్షర్ తర్వాతి బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. అక్షర్, అశ్విన్ కలిసి ఎనిమిదో వికెట్కు 114 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించారు. ఆసీస్ బౌలర్లలో లయాన్ ఐదు వికెట్లు తీశాడు, కుహ్నేమాన్, మర్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కమిన్స్కు ఒక వికెట్ దక్కింది.
కొత్త బంతి తీసుకున్న కమిన్స్ అశ్విన్ను ఔట్ చేసి ఆస్ట్రేలియాక బ్రేక్ ఇచ్చాడు. అశ్విన్ గాల్లోకి లేపిన బంతిని స్క్వేర్ లెగ్లో రేన్ షా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 253 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఒకదశలో ఇండియా 200 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, అక్షర్, అశ్విన్ జోడీ స్కోర్బోర్డును 250 దాటించింది. వీళ్లిద్దరూ ఆసీస్ స్పిన్ త్రయాన్ని సమర్ధంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో కలిసి అశ్విన్ 114 రన్స్ జోడించాడు.
అక్షర్ ఈ సిరీస్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. కుహ్నేమాన్ ఓవర్లో సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. క్లిష్ట సమయంలో ఈ ఆల్రౌండర్ సాధికారిక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ (44), శ్రీకర్ భరత్ (6) ఔటయ్యాక అక్షర్, అశ్విన్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. 139 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కొల్పోయింది. అక్షర్తో జత కలిసిన అశ్విన్ ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు.
ఈ టెస్టులో నాథన్ లయాన్ మరో రికార్డుకు చేరువయ్యాడు. దాంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రెండో బౌలర్గా లయాన్ రికార్డు సాధించాడు. భారత లెజెండ్ అనిల్ కుంబ్లే 10 సార్లు ఐదు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (7సార్లు) మూడో స్థానంలో నిలిచాడు. శ్రీకర్ భరత్ను ఔట్ చేసి లయాన్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.