మొహాలీలో జరుగుతున్న టీ20లో ఆస్ట్రేలియా టాపార్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. వారి దూకుడు చూస్తుంటే భారత్ నిర్దేశించిన 209 పరుగుల టార్గెట్ను సులభంగా ఛేజ్ చేసేలా కనిపిస్తున్నారు. అయితే పదకొండో ఓవర్ తొలి బంతికే అక్షర్ పటేల్ మరోసారి సత్తాచాటాడు. కామెరూన్ గ్రీన్ను పెవిలియన్ చేర్చాడు. అతను వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గ్రీన్.. బంతిని సరిగా అంచనా వేయలేదు. దీంతో గాల్లోకి లేచిన బంతి సర్కిల్కు కొంచెం ఆవలకు మాత్రమే వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకోవడంతో గ్రీన్ ఇన్నింగ్స్ ముగిసింది.
కాగా, భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్కు తన కెరీర్లో తొలిసారి ఓపెనర్ అవతారమెత్తిన కామెరూన్ గ్రీన్ (30 బంతుల్లో 61) అదిరిపోయే ఆరంభం అందించాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (22) అవుటైన తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ (23 నాటౌట్) అతనికి మంచి సహకారం అందించాడు.
దీంతో ఆసీస్ స్కోరుబోర్డు ఉరకలు పెడుతోంది. ఈ క్రమంలోనే 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు కేవలం ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. కంగారూలు గెలవాలంటే పది ఓవర్లలో మరో 100 పరుగులు చేస్తే సరిపోతుంది. భారత బౌలింగ్ పేలవంగా ఉండటంతోపాటు ఫీల్డింగ్ కూడా చెత్తగా చేయడం టీమిండియాను దెబ్బకొడుతోంది. ఇప్పటికీ అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ చెరోసారి క్యాచ్లు నేలపాలు చేశారు.