‘పెద్ద పెద్ద స్టార్లు లేకపోయినా ఇంగ్లండ్పై భారత్ విజయదుందుభి మోగించింది. కోహ్లీ, షమీ, రాహుల్ టెస్టు సిరీస్కు దూరమైనా..యువ క్రికటర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ఖాన్, ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్ తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న కలను సాకారం చేసుకుంటూ కుర్రాళ్లు టీమ్ఇండియా చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నారు. బజ్బాల్తో భారత గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్కు దిమ్మతిరిగే రీతిలో సమాధానమిస్తూ మట్టికరిపించారు. గతంలోనూ ఆస్ట్రేలియాపై చేతల్లో చూపెట్టారు’ అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్న మాట ఇది. ఇక్కడే అర్థమవుతుంది..స్టార్ క్రికెటర్ల గైర్హాజరులో యువకులు అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకుంటూ ఇంగ్లండ్ను ఓడించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకబడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోయిన రోహిత్సేన..కుర్రాళ్ల ప్రతిభను నమ్ముకుని అనుకున్న ఫలితం రాబట్టింది. ఈ నేపథ్యంలో సిరీస్ విజయంలో కీలకమైన యువ క్రికెటర్లపై ప్రత్యేక కథనం.
Team India | జైస్వాల్ ధమాకా : జైస్వాల్..వైజాగ్ టెస్టులో తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. జట్టు మొత్తంలో జైస్వాల్ డబుల్ సెంచరీ తర్వాత అత్యధిక స్కోరు 34(గిల్) పరుగులే కావడం విశేషం. అంటే జట్టు బ్యాటింగ్ భారాన్ని మొత్తం జైస్వాల్ తన ఒంటిచేత్తో మోశాడు. అద్భుతమైన పరిణతి ప్రదరిస్తూ ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. ముంబై మైదానాల్లో క్రికెట్ ఓనమాలు దిద్దిన జైస్వాల్..టీమ్ఇండియా భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. రాజ్కోట్ టెస్టులోనూ జైస్వాల్ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైనా..మలి ఇన్నింగ్స్లో అజేయ ద్విశతకంతో అదరగొట్టాడు. అసలు ఇంత సలువుగా పరుగులు కొల్లగొట్టవచ్చా అన్న రీతిలో ఇంగ్లండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ సిరీస్లో రెండో డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. నాలుగోదైన రాంచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ(73) చేసిన జైస్వాల్..రెండో ఇన్నింగ్స్లోనూ సత్తాచాటాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ సాధించాడు. మొత్తంగా సిరీస్లో 712 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ గవాస్కర్ సరసన నిలిచాడు.
సర్ఫరాజ్ సూపర్
దేశవాళీ టోర్నీల్లో టన్నుల కొద్ది పరుగులు సాధించి జాతీయ జట్టు పిలుపు కోసం ఇన్నాళ్లు వేచిచూసిన ముంబైకర్ సర్ఫరాజ్ఖాన్ కల ఇన్ని రోజులకు నెరవేరింది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా అరంగేట్రం టెస్టులో అర్ధసెంచరీలతో తన సత్తాచూపెట్టాడు. నాలుగో టెస్టులో నిరాశపరిచినా సర్ఫరాజ్.. ధర్మశాల పోరులో కీలక అర్ధసెంచరీతో భారత భారీ స్కోరుకు బాటలు వేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్ల్లో 50 సగటుతో 200 పరుగులు చేశాడు.
జురెల్ మెరుపుల్
రాజ్కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన ఈ యువ వికెట్కీపర్, బ్యాటర్ తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. శ్రీకర్ భరత్ స్థానంలో జట్టులోకొచ్చిన జురెల్ తొలి మ్యాచ్లో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. రాంచీ టెస్టులో సహచరులు విఫలమైన చోట జురెల్ సాధికారిక ఇన్నింగ్స్తో జట్టును నిలబెట్టాడు. 90 పరుగులతో భారత్ను ఒడ్డును పడేయడంలో కీలకమయ్యాడు. ఇంగ్లిష్ బౌలింగ్ దాడిని నిలువరిస్తూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశాడు. అదే జోరు కొనసాగిస్తూ లక్ష్యఛేదనలో గిల్తో కలిసి జట్టు గెలుపు బాట పట్టించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్లో 190 పరుగులతో ఆకట్టుకున్నాడు.