పుణె: అల్టిమేట్ ఖోఖో లీగ్ తొలి సీజన్లో తెలుగు యోధాస్ జట్టు రన్నరప్గా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో యోధాస్ ఒక్క పాయింట్ తేడాతో ఒడిశా జగ్గర్నాట్స్ చేతిలో ఓటమి పాలైంది. ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన తుదిపోరులో ఒడిశా 46-45 తేడాతో తెలుగు యోధాస్పై విజయం సాధించింది. చాంపియన్ ఒడిశా కోటి రూపాయల ప్రైజ్మనీ చేజిక్కించుకోగా.. రన్నరప్గా నిలిచిన తెలుగు యోధాస్కు రూ. 50 లక్షలు దక్కాయి.
మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనే వరకు ఆధిక్యంలో కొనసాగిన యోధాస్.. ఆఖర్లో ఒత్తిడికి లోనై పరాజయం వైపు నిలిచింది. చివరి క్షణాల్లో ఒడిశా ఆటగాడు సూరజ్ స్కై డైవ్తో యోధాస్ ప్లేయర్ను ఔట్ చేసి మూడు పాయింట్లు సాధించడంతో ఓడిశా ట్రోఫీ చేజిక్కించుకుంది. తెలుగు యోధాస్ తరఫున రోహన్ అత్యధికంగా 11 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. చెన్నై జట్టుకు చెందిన కశ్యప్కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కగా.. తెలుగు యోధాస్ ఆటగాడు దీపక్ మాధవ్ ‘బెస్ట్ డిఫెండర్’గా నిలిచాడు.