న్యూఢిల్లీ: ఒక అథ్లెట్గా తాను ఒక వర్గం తరఫున కాకుండా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. తన వరకు హిందూ-ముస్లిం అనేది విషయమే కాదని భారత్కు ఆడటాన్నే గర్వంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. దేశం తరఫున తాను సాధించిన పతకాల కంటే ఏ మతానికి చెందానో అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతుందని అంది. సోమవారం ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్స్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ పలు అంశాలపై మాట్లాడింది. ‘మన భారత బాక్సర్లు చాలా ప్రతిభావంతులు. ప్రపంచంలో మనం ఎవరికీ తీసిపోం. రెగ్యులర్ టోర్నీల్లో సత్తాచాటుతున్నప్పటికీ ఒలింపిక్స్, ప్రపంచ చాంపియ్షిప్ లాంటి మెగాటోర్నీల్లో తడబడుతున్నాం. దీన్ని అధిగమించాల్సిన అవసరముంది. మేరీకోమ్తో పోటీపడకుండా ఉంటే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో ప్రపంచ టైటిల్ సాధించాను’ అని నిఖత్ అంది.