సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ను విజయవంతం చేసేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ప్రపంచ హ్యాండ్బాల్ చాంపియన్షిప్నకు ఆతిథ్యమిస్తున్న స్వీడన్లో ఆదివారం కామన్వెల్త్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ (సీహెచ్ఎఫ్) సదస్సు జరిగింది. సీహెచ్ఎఫ్ ప్రెసిడెంట్ రూత్ సాండర్స్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రావు.. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగనున్న ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 8 జట్లలో స్వదేశీ, విదేశీ ప్లేయర్ల సమ్మేళనంతో లీగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆటగాళ్లను వేలం పద్దతిలో తీసుకున్నామని.. అంతర్జాతీయ ప్రమాణాలతో లీగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత్లో తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్ ను వీక్షించేందుకు సీహెచ్ఎఫ్ ప్రెసిడెంట్ రూత్ సాండర్స్తో సహా ఇతర కామన్వెల్త్ దేశాల హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షులను జగన్ మోహన్ రావు ఆహ్వానించారు.