ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాకిస్తాన్లు ఈనెల 28న తలపడనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ కంటే ముందే జరుగనున్న దాయాదుల పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తే మాత్రం అప్పుడు పాకిస్తాన్కు తిప్పలు తప్పవంటున్నాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.
మెగా టోర్నీకి ముందు భట్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘కోహ్లీ అనుభవం, అతడి శక్తి సామర్థ్యాలేమిటో అందరికీ తెలిసినవే. అతడు వీలైనంత త్వరగా ఫామ్లోకి రావాలని టీమిండియా కోరుకుంటున్నది. గతంలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతూ పలువురు ఆటగాళ్లు ఫామ్లోకి వచ్చిన సందర్భాలు మన కళ్ల ముందున్నాయి…
అదే పునరావృతమై కోహ్లీ కూడా పాకిస్తాన్తో మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడంటే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. అతడు పాకిస్తాన్కు కచ్చితంగా తలనొప్పిగా మారతాడు..’ అని హెచ్చరించాడు. కోహ్లీతో పాటు టీమిండియా అనుసరిస్తున్న రొటేషన్ పాలసీ మీద సల్మాన్ భట్ ప్రశంసలు కురిపించాడు. సీనియర్లకు విశ్రాంతినిస్తూ యువకులను కీలక సిరీస్లు ఆడిస్తూ టీమిండియా తమ బెంచ్ను బలంగా తయారుచేసుకుంటుందని కొనియాడాడు.
రొటేషన్ పాలసీ కారణంగా టీమిండియాకు ఒకరు కాకుంటే మరొక మ్యాచ్ విన్నర్ దొరుకుతున్నాడని అది వారికి లాభిస్తున్నదని భట్ చెప్పాడు. ఆటగాళ్లకే కాదు.. ఏకంగా హెడ్కోచ్కూ బ్యాకప్ పెట్టడం మాములు విషయం కాదని అన్నాడు. మానవ వనరులను వృద్ధి చేసుకోవడంలో ఇది భారత క్రికెట్లో అద్భుత పరిణామమని చెప్పుకొచ్చాడు. ఇటీవల ముగిసిన ఐర్లాండ్ పర్యటనతో పాటు త్వరలో జరగాల్సి ఉన్న జింబాబ్వే టూర్లో హెడ్కోచ్గా రాహుల్ ద్రావిడ్కు విరామమిచ్చిన భారత జట్టు.. వీవీఎస్ లక్ష్మణ్కు ఆ బాధ్యతలు అప్పజెప్పిన విషయం తెలిసిందే.