హైదరాబాద్: దాయాది జట్టు పాకిస్థాన్ వన్ డే ప్రపంచకప్లో అత్యంత అరుదైన రికార్డు సృష్టించింది. అక్టోబర్ 10న హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఈ ఫీట్ను సాధించింది. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 344 పరుగులు చేసింది. పాకిస్థాన్కు 345 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ప్రతిగా పాకిస్థాన్ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే 48.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 345 పరుగులు సాధించి శ్రీలంకపై ఘన విజయం నమోదు చేసింది. ఈ విజయంతో ప్రపంచకప్ చరిత్రలో అతి భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా ఈ రికార్డు ఐర్లాండ్ జట్టు పేరిట ఉంది. 2011 ప్రపంచకప్లో ఇంగ్లండ్ టీమ్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ చేధించింది. వన్ డే ప్రపంచకప్లో ఇప్పటిదాకా ఇదే రికార్డు చేజింగ్ కాగా, ఇప్పుడు ఆ రికార్డును పాకిస్థాన్ సొంతం చేసుకుంది.