ధర్మశాల: అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ బంతి అందుకోవడమే ఆలస్యం ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఈసారి అఫ్గానిస్థాన్ జట్టు ఈ స్పిన్ ఆల్రౌండర్పై భారీ అంచనాలే పెట్టుకుంది. బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన రషీద్ తాజాగా తన ఔదార్యంతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు. ఇంతకు ఏం చేశాడంటే.. తమదేశంలో భూకంపం ధాటికి ఆత్మీయులను, సర్వస్వాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిన ప్రజలను చూసి చలించిన రషీద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల ఫీజు రూపంలో తనకు వచ్చే మొత్తం ఆదాయాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు ఆదివారం ప్రకటించాడు. ఈ ఘోర ప్రకృతి విపత్తు కారణంగా రోడ్డున పడినవాళ్లను ఆదుకునేందుకు త్వరలోనే నిధులు సేకరణ చేపడతానని రషీద్ పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతాలు హెరాత్, ఫరాహ్, బద్ఘీస్లో భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని తెలిసింది. అందుకని బాధితుల కోసం వరల్డ్ కప్లో నా మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటిస్తున్నా. కష్టాల్లో ఉన్న నా దేశ ప్రజలకు అండగా నిలిచేందుకు మరికొందరితో కలిసి త్వరలోనే నిధులు సేకరిస్తా అని రషీద్ ట్వీట్ చేశాడు.