ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్లో భారత్ మరోసారి భారీ స్కోరుచేసింది. బ్లూమ్ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. ఈ టోర్నీలో ఇదివరకే ఓ సెంచరీ, మరో అర్థ సెంచరీతో జోరుమీదున్న ముషీర్ ఖాన్.. (126 బంతుల్లో 131, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి మూడంకెల స్కోరుతో చెలరేగాడు. గ్రూప్ దశలో మూడు మ్యాచ్లను గెలిచి సూపర్ సిక్స్లో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. ముషీర్కు తోడుగా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (58), కెప్టెన్ ఉదయ్ సహరన్ (34) లు రాణించడంతో కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన భారత్ ఐదో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ (యూనైటెడ్ స్టేట్స్తో)లో సెంచరీ చేసిన అర్షిన్ కులకర్ణి (9) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. వన్ డౌన్గా వచ్చిన ముషీర్.. ఆదర్శ్తో రెండో వికెట్కు 77 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కెప్టెన్ ఉదయ్తోనూ మూడో వికెట్కు 87 రన్స్ జత చేశాడు. 109 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న ముషీర్ ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ఈ టోర్నీలో అతడికి ఇది రెండో శతకం కావడం గమనార్హం. ఈ టోర్నీలో మరో శతకం చేస్తే ముషీర్.. 2004లో శిఖర్ ధావన్ పేరిట ఉన్న మూడు సెంచరీల (అండర్ – 19 వరల్డ్ కప్లో) రికార్డును సమం చేస్తాడు.
Back-to-back hundreds for Musheer Khan in #U19WorldCup 2024 👊#INDvNZ pic.twitter.com/7ucQE4mxQt
— ICC (@ICC) January 30, 2024
ఉదయ్ నిష్క్రమించాక భారత్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎరవెల్లి అవినాశ్ (17), ప్రియాన్షు మోలియా (10), సచిన్ దాస్ (11)లు ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యారు. గత మూడు మ్యాచ్లలో భారత్ ఎదుర్కున్న ప్రత్యర్థుల కంటే న్యూజిలాండ్ కఠినమైందే కావడంతో ఈ మ్యాచ్లో స్కోరును కాపాడుకోవడం టీమిండియా యువ బౌలర్లకు సవాల్ వంటిదే…