మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
అల్వాల్, మార్చి 9: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళల అభ్యున్నతిని చాటాలంటే ప్రతిరోజూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్ వెంకటాపూర్లోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా శక్తి ఎంతో గొప్పదన్నారు. ఆమె తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని సవాళ్లను ఎదుర్కొంటూనే ముందుకు సాగాలన్నారు. కరోనా సమయంలో వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలు అందించారన్నారు. విపత్కర పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, పారిశుధ్య కార్మికులు అందించిన సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, డీడబ్ల్యూవో జ్యోతిపద్మ పాల్గొన్నారు.