ఎడిన్బర్గ్ (స్కాట్లాండ్) : వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్తో పాటు 2028లో నిర్వహించనున్న టీ20 వరల్డ్కప్ పోటీలను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ ఈ టోర్నీల్లో సమూల మార్పులు చేసింది. వన్డే వరల్డ్కప్ను మూడు దశల్లో, పొట్టి పోరులో కొత్తగా సూపర్-10ను విస్తరించనున్నట్టు ఈ మేరకు ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 14 జట్లు పాల్గొనబోయే వన్డే ప్రపంచకప్లో 12-14 మధ్య ర్యాంకు ఉన్న 3 జట్లు ముందుగా ‘సూపర్ సిరీస్’ అనే తొలిరౌండ్ మ్యాచ్లు ఆడతాయి. అందులో అగ్రస్థానాన నిలిచిన జట్టు మాత్రమే ముందంజ వేస్తుంది. రెండో దశలో 12 జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి.
ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లతో పాటు రెండు గ్రూపుల్లోని తర్వాతి బెస్ట్ టీమ్ ‘సూపర్ 7’ స్టేజ్కు చేరుతుంది. ఈ దశలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్కు వెళ్తాయి. టీ20ల విషయానికొస్తే.. గతంలో నిర్వహించిన సూపర్-8కు బదులు కొత్తగా సూపర్-10ను చేర్చారు. 20 జట్లు తలపడే ఈ టోర్నీలో నాలుగేసి జట్లు ఐదు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడుతాయి. ఈ గ్రూపుల్లో టాప్-2 టీమ్స్ సెమీస్కు అర్హత సాధిస్తే 2, 3 స్థానాల్లో ఉన్న జట్లు వేరే గ్రూపులోని అదే స్థానంలో ఉన్న జట్లతో ‘ఎలిమినేటర్’ ఆడతాయి. ఎలిమినేటర్లో గెలిచిన రెండు జట్లు సెమీస్కు ముందంజ వేస్తాయి.