Shubhman Gill | ఫార్మాట్లతో సంబంధం లేకుండా.. నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి నెలా అందిస్తున్న అత్యుత్తమ ప్లేయర్ అవార్డును గిల్ రెండో సారి అందుకున్నాడు. సెప్టెంబర్ నెలలో ప్రదర్శనకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు గిల్ ఎంపికయ్యాడు. తద్వారా మన దేశం నుంచి రెండోసారి ఐసీసీ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న తొలి, ఏకైక ప్లేయర్గా శుభ్మన్ రికార్డుల్లోకి ఎక్కాడు. గత నెలలో ఆసియా కప్ సందర్భంగా శుభ్మన్ గిల్ దంచికొట్టిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్, భారత పేసర్ మహమ్మద్ సిరాజ్తో పోటీపడిన గిల్ ఈ రేసులో వారిద్దరినీ వెనక్కి నెట్టి టాప్లో నిలిచాడు. వన్డే ప్రపంచకప్లోనూ గిల్పై టీమ్ మేనేజ్మెంట్తో పాటు అభిమానులు భారీ ఆశలు పెట్టుకోగా.. మెగాటోర్నీకి ముందు అతడు డెంగ్యూ బారీన పడ్డాడు. దీంతో టీమ్ఇండియా ఆడిన తొలి రెండు మ్యాచ్లకు గిల్ దూరమయ్యాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో పాటు.. ఢిల్లీలో అఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్కు గిల్ అందుబాటులో లేకుండా పోయాడు.
అయితే డెంగ్యూ నుంచి కోలుకున్న గిల్ ప్రస్తుతం దాయాది పాకిస్థాన్తో శనివారం జరిగే పోరుకు సిద్ధమవుతున్నాడు. జట్టు సభ్యులందరి కంటే ముందే అహ్మదాబాద్ (పాక్తో మ్యాచ్ జరిగే వేదిక)కు చేరుకున్న గిల్ నెట్స్లో చెమటోడుస్తున్నాడు. అంతా సవ్యంగా సాగితే అతడు పాకిస్థాన్తో మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది వన్డే క్రికెట్లో ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ పరుగులు చేసిన గిల్.. భారత భవిష్యత్ స్టార్గా మన్ననలు అందుకుంటున్నాడు.