Ian Chappell : బౌలర్లపై ఆధిపత్య చెలాయించడంలో రిషభ్ పంత్ను భర్తీ చేసే ఆటగాడు లేడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. త్వరలో జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గురించి మాట్లాడుతూ.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందుబాటులో లేకపోవడం భారత్కు తీరని లోటు అని అన్నాడు. ‘పంత్ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎందుకంటే.. అతడిలా బౌలర్లపై అధిపత్యం చెలాయించే బ్యాటర్ లేడు. పంత్ ఆడడం లేదు కాబట్టి.. టీమిండియా టాప్, మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడాలి’ అని ఛాపెల్ తెలిపాడు.
రెండేళ్ల క్రితం.. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ టెస్టు సిరీస్ గెలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ టెస్టులో 97, గబ్బా స్టేడియంలో 89 రన్స్తో జట్టును గట్టెక్కించాడు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి, అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. పూజారాతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. అయితే.. పోయిన ఏడాది డిసెంబర్లో కారు యాక్సిడెంట్లో గాయపడ్డ పంత్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. ఈమధ్యే అతడికి సర్జరీ చేశారు.
పంత్ ప్లేస్లో ఆ ఇద్దరు
ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, భారత పర్యటనకు రానుంది. ఇరు జట్లు బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనున్నాయి. పంత్ స్థానంలో మొదటి రెండు టెస్టులకు ఇషాన్ కిషన్, కేఎస్ భరత్లను ఎంపిక చేశారు. ఈ ఏడాది జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు ఈ సిరీస్ భారత్కు చాలా కీలకం. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్పూర్లో ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది.