ఇండియా-ఇంగ్లండ్ రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా భారత తొలి ఇన్నింగ్స్లో చివర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు టీమిండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా. 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84వ ఓవర్లో 29 పరుగులు (వైడ్ + ఫోర్, నో బాల్తో కలిపి 35 రన్స్) రాబట్టాడు. ఫలితంగా భారత స్కోరు 400 (416) పరుగులు దాటింది. అయితే బుమ్రా బ్యాటింగ్పై తాజాగా ఆయన భార్య సంజనా గణేషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో భాగంగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దెనేతో ఆన్లైన్లో సంజనా మాట్లాడింది. ఈ సందర్భంగా మహేళ.. ‘బుమ్రా బౌలింగ్ సక్సెస్లో నీ పాత్ర ఏమైనా ఉందా..?’ అని అడిగాడు.
జయవర్దెనే అడిగిన ప్రశ్నకు సంజనా సమాధానం చెబుతూ.. ‘నాదా..? లేదు. నేను బుమ్రా బ్యాటింగ్ మీదే ఫోకస్ చేస్తాను. నేను అతడికి కొన్ని టిప్స్ చెబుతాను. బుమ్రా బ్యాటింగ్లో మీరు చూస్తున్న స్కిల్స్ అన్నీ నావే.. అదంతా నా చలవే (నవ్వుతూ)’ అని ఫన్నీగా చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.
బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో బుమ్రా.. 4, 4 (వైడ్), 6 (నోబాల్), 4, 4, 4, 6, 1 పరుగులు రాబట్టాడు. దీంతో బ్రాడ్ టెస్టులలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ రాబిన్ పీటర్సన్.. ఒక ఓవర్లో 28 పరుగులిచ్చాడు. 2003లో వాండరర్స్లో సఫారీలతో టెస్టు ఆడుతూ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా.. ఈ ఘనత (28 పరుగులు) సాధించాడు. తాజాగా బుమ్రా (29 రన్స్).. లారా రికార్డును బ్రేక్ చేశాడు.