న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని రూర్కీ వద్ద క్రికెటర్ రిషబ్ పంత్ కారు ఇవాళ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో రిషబ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను నడుపుతున్న మెర్సిడీజ్ ఎస్యూవీ ఢివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన కారు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న పంత్ను సుశీల్ మాన్ అనే బస్సు డ్రైవర్ రక్షించాడు. అతను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలిపాడు.
చాలా హై స్పీడ్లో ఓ ఎస్యూవీ తన బస్సుకు ఎదురుగా వచ్చిందని, ఢివైడర్ను ఢీకొన్ని ఆ కారు పల్టీలు కొట్టిందని, ఆ సమయంలో తన బస్సును పక్కకు నిలిపివేసి, తొందరగా ఆ కారు వైపు పరుగెత్తినట్లు సుశీల్ మాన్ తెలిపాడు. పల్టీలు కొట్టిన కారు తన బస్సు కింద పడుతుందో ఏమో అని భయపడినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. కానీ ప్రమాదానికి గురైన ఆ కారు ముందే ఆగిపోయినట్లు చెప్పాడు.
కారు కిటికీ నుంచి డ్రైవర్ (క్రికెటర్ పంత్) సగం బయటకు వచ్చాడని, క్రికెటర్ అని అతను తనకు చెప్పినట్లు సుశీల్ వెల్లడించాడు. తన తల్లికి ఫోన్ చేయాలని ఆ వ్యక్తి అడిగాడని, ఆ నెంబర్కు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు.
క్రికెట్ను వీక్షించే అలవాటు తనకు లేదని, గాయానికి గురైంది రిషబ్ పంత్ అని తనకు తెలియదని, కానీ తన బస్సులో ఉన్న ఇతరులు ఆ క్రికెటర్ను గుర్తించారని బస్సు డ్రైవర్ సుశీల్ తెలిపాడు. రిషబ్ను కారు నుంచి బయటకు తీసిన తర్వాత.. ఆ వాహనంలో మరెవరైనా ఉన్నారేమో అని వెతికినట్లు చెప్పాడు.
కారులో ఉన్న బ్లూ బ్యాగ్ తీశానని, దాంట్లో 8 వేల రూపాయాలు ఉన్నాయని, పంత్ను అంబులెన్సులో ఎక్కిస్తున్న సమయంలో ఆ బ్యాగ్ను అతనికి ఇచ్చినట్లు చెప్పాడు. డ్రైవింగ్ చేస్తూ నిద్ర మత్తులోకి జారుకున్న పంత్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.