తాను మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశాలు లేవని వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో బాగా ఆడినప్పటికీ తనను సెలక్టర్లు పట్టించుకోలేదంటే ఇక భారత జట్టులో తనకు తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్టేనని అంటున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన సాహా.. అంచనాలకు మించి రాణించాడు.
ఇంగ్లాండ్ టూర్ తో పాటు ఐర్లాండ్ తో రెండు టీ20లకు గాను ఎంపిక చేసిన జట్టులో తన పేరు లేకపోవడంపై సాహా స్పందించాడు. ‘నేను మళ్లీ సెలక్ట్ అవుతాననే ఆశలు నాకు లేవు. ఇప్పటికే చీఫ్ సెలక్టర్ (చేతన్ శర్మ)తో పాటు హెడ్ కోచ్ (రాహుల్ ద్రావిడ్) లు నాకు ఈ విషయం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఒకవేళ వాళ్లు నన్ను ఎంపిక చేయాల్సి ఉంటే ఐపీఎల్ లో నా ప్రదర్శన చూసైనా జట్టులోకి తీసుకుని ఉండాల్సింది.
అలా జరిగుంటే ఈపాటికి నేను కూడా టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉండేవాడిని. కానీ అలా జరుగలేదు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో నేను భవిష్యత్ లో భారత జట్టులోకి రావడం కష్టమేనని తెలిసిపోయింది. అయితే జాతీయ జట్టులో చోటు రానంత మాత్రానా నేను క్రికెట్ ఆడటం మానను. నేను ఈ ఆటను ప్రేమించినంత వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటా..’నని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన సాహా.. 11 ఇన్నింగ్స్ లలో 317 పరుగులు చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి అంచనాలకు మించి రాణించాడు. అయినా సెలక్టర్లు మాత్రం సాహాను పట్టించుకోలేదు.