Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ వైట్ బాల్ క్రికెట్కు పనికిరాడని, అతడిని వన్డేలు, టీ20 జట్టుకు ఎంపిక చేయడం అనవసరమని యువీ వ్యాఖ్యానించాడు. టెస్టులలో అశ్విన్ గొప్ప బౌలరే అయినప్పటికీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడి వల్ల జట్టుకు ఏం ఉపయోగం ఉందని ప్రశ్నించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ ఈ కామెంట్స్ చేశాడు. యువీ, అశ్విన్లు భారత్ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులన్న విషయం తెలిసిందే.
యువీ మాట్లాడుతూ… ‘అశ్విన్ గొప్ప బౌలరే. అందులో అనుమానం లేదు. కానీ వన్డేలు, టీ20లలో అతడిని జట్టులోకి తీసుకోవడం అనవసరమని నా అభిప్రాయం. అతడు బౌలింగ్ బాగా చేస్తాడు కావచ్చు. కానీ బ్యాటింగ్, ఫీల్డింగ్లలో అశ్విన్ టీమ్కు చేసే కాంట్రిబ్యూషన్ ఏంటి..? టెస్టులలో చూసుకుంటే అశ్విన్ ఆల్ రౌండర్గా కచ్చితంగా జట్టులో ఉండాల్సిందే. అందులో అనుమానమే లేదు. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం టీమిండియాకు అతడి అవసరం లేదు..’ అని స్పష్టం చేశాడు.
టెస్టులలో 500 వికెట్లకు (490 వికెట్లు) చేరువలో ఉన్న అశ్విన్.. ఇంగ్లండ్తో సిరీస్లో దానిని అధిగమించాలని భావిస్తున్నాడు. వైట్ బాల్ క్రికెట్లో అశ్విన్ అంత గొప్ప ప్రదర్శనలు చేయకపోయినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుసగా ఐసీసీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అవకాశమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్లో కూడా అశ్విన్ జట్టులో ఉన్నాడు. యుజ్వేంద్ర చాహల్ను తప్పించి అశ్విన్ను జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.