CWC 2023 | వన్డే వరల్డ్కప్లో ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగింటిలో ఓడిన బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో ఉంది. జట్టు వైఫల్యాల కంటే ఆటగాళ్ల మధ్య ఐక్యతే బంగ్లాదేశ్ను తీవ్రంగా వేధిస్తున్నది. ప్రపంచకప్కు ముందే కెప్టెన్ షకిబ్ అల్ హసన్, మాజీ సారథి తమీమ్ ఇక్బాల్ మధ్య విభేదాలు తలెత్తి అతడు పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిశాక ఈ మ్యాచ్లో వీరోచిత సెంచరీ చేసి బంగ్లా పరువు నిలిపిన మహ్మదుల్లా రియాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
సౌతాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత మహ్మదుల్లా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు దాని (వన్డే ప్రపంచకప్ కంటే ముందు మహ్మదుల్లా సుమారు ఆరు నెలల పాటు జాతీయ జట్టుకు ఆడలేదు) గురించి ఏం చెప్పదలుచుకోవడం లేదు. వాస్తవానికి నేను చాలా మాట్లాడాల్సి ఉంది. కానీ దానికి ఇది సరైన సమయం కాదు..’ అని అన్నాడు.
అంతేగాక తనకు ఎక్కువకాలం రెస్ట్ ఇచ్చారని, అయితే అది తన చేతుల్లో లేదని మహ్మదుల్లా వాపోయాడు. ‘నాకు జాతీయ జట్టులో చాలాకాలం పాటు రెస్ట్ ఇచ్చారు. అయితే అది నా చేతుల్లో లేదు. అది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం. నేను నిజాయితీగా ఏమైనా చేయగలిగేది ఉంటే అది నా జట్టుకు ఉపయోగపడేలా ఆడటమే..’ అని చెప్పాడు.
గతేడాది ఇండియాతో వన్డే సిరీస్ తర్వాత మహ్మదుల్లా మార్చిలో ఇంగ్లాండ్తో సిరీస్లో ఆడాడు. కానీ ఆ తర్వాత పలు సిరీస్ల పాటు అతడికి జట్టులో చోటు దక్కలేదు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే కారణంగా బంగ్లా మేనేజ్మెంట్ మహ్మదుల్లాను పక్కనబెట్టింది. కానీ వాళ్లంతా ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన నేపథ్యంలో వరల్డ్ కప్ కు ముందు ఆగమేఘాల మీద మళ్లీ మహ్మదుల్లాను పిలిచింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. జట్టులో చోటిచ్చినా మహ్మదుల్లాను బ్యాటింగ్ ఆర్డర్లో ఆరో స్థానంలో పంపడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిపైనా మహ్మదుల్లా నిరాశగా ఉన్నట్టు బంగ్లా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుత సారథి షకిబ్తో పాటు టీమ్ మేనేజ్మెంట్ను టార్గెట్గా చేసుకునే మాట్లాడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.