హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోవా వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టి టోర్నీలో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ పసిడి వెలుగులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 3-0(11-6, 18-16, 11-5)తో లిలీ చాంగ్(అమెరికా)పై అద్భుత విజయం సాధించింది. రెండు సార్లు జాతీయ టీటీ చాంపియన్గా నిలిచిన శ్రీజ…తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. మహిళల తుది పోరు పూర్తి ఏకపక్షంగా సాగింది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన శ్రీజ..ప్రపంచ 46వ ర్యాంకర్ చాంగ్కు ఎక్కడా అవకాశమివ్వలేదు. గేమ్ గేమ్కు గేర్ మార్చుతూ టైటిల్ను ఒడిసిపట్టుకుంది. తొలి గేమ్లో 11-6తో ఆధిక్యం కనబరిచిన ఈ హైదరాబాదీ ప్యాడ్లర్ రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా వెనుకకు తగ్గలేదు.
మూడో గేమ్లో చాంగ్ను కంగుతినిపించిన శ్రీజ టైటిల్ దక్కించుకుంది. స్వర్ణం గెలిచే క్రమంలో తన(94) కంటే మెరుగైన ర్యాంక్లో అమెరికా ప్యాడ్లర్ అమీ వాంగ్(37)ను క్వార్టర్స్లో, సెమీస్లో జియాన్షాన్ జావోను శ్రీజ మట్టికరిపించింది. హోరాహోరీగా సెమీస్లో శ్రీజ 9-11, 11-5, 11-6, 10-12, 11-9తో జావోపై చిరస్మరణీయ విజయం సాధించింది. ఐదు గేమ్ల పాటు సాగిన పోరులోఈ హైదరాబాదీ యువ ప్యాడ్లర్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఓవైపు ప్రత్యర్థి దీటుగా పోరాడుతున్నా..వెరవకుండా పోరాటపటిమ కనబరిచింది.
కష్టానికి ప్రతిఫలమిది: శ్రీజ
డబ్ల్యూటీటీ టోర్నీలో తొలిసారి టైటిల్ గెలువడం చాలా సంతోషంగా ఉంది. నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. నా కెరీర్లో ఇది తొలి అంతర్జాతీయ టైటిల్. టోర్నీలో క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్ల్లో ఉత్కంఠ విజయాల తర్వాత ఇది సొంతమైంది. అమీ, లిలీ నా కంటే మెరుగైన ర్యాంక్ కల్గిన ప్లేయర్లు. వారిపై గెలువడం మరింత ఆత్మవిశ్వాసాన్నిచ్చింది.