హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్ వేదికగా జరిగిన మహిళల అండర్-23 ట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పోరులో హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ గొంగడి త్రిష(57 బంతుల్లో 73) అర్ధసెంచరీతో అదరగొట్టింది.
ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ త్రిష ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులకు పరిమితమైంది. పుష్పలత(58) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతావారు విఫలమయ్యారు. యశశ్రీ ఆకట్టుకుంది. క్వార్టర్స్లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది.