సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ తీరంలో ఫార్ములా -ఈ రేసింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది.అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు 2.8 కి.మీ పొడవునా ఉన్న ట్రాక్ చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వృత్తాకారంలో ఉండే రేసింగ్ ట్రాక్పై 4 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, 10 చోట్ల ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ ఖాళీ స్థలంలో ఫార్ములా-ఈ కార్ల కోసం కస్టమైజ్డ్ గ్యారేజ్లు బిగిస్తున్నారు. వీఐపీల కోసం మొదటి అంతస్థులో విశాలమైన గ్యాలరీలను నిర్మిస్తున్నారు. మరోవైపు రెండు రోజుల కిత్రమే నగరానికి చేరుకున్న 22 ఫార్ములా-ఈ కార్లను గ్యారేజ్లను తీసుకురానున్నారు. భధ్రత కోసం ట్రాక్ చుట్టూ ఎత్తైన ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న ప్రధాన పోటీలకు రెండు రోజుల ముందే ఫార్ములా-ఈ కార్లు మొదటి సారి ట్రాక్పై పరుగులు పెట్టనున్నాయి.
సుమారు 322 కి.మీ వేగంతో పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ను చూసేందుకు నగర వాసులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ పోటీల్లో కార్ల కంపెనీలైన మెక్ లారెన్, మసెరటి, పోర్షే, జాగ్వార్, నిస్సాన్ మరియు మహీంద్రా రేసింగ్ వంటి ప్రముఖ సంస్థలు సహా మొత్తం 22 కార్లతో 11 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. రేసులతో పాటు ఫెస్టివల్ లో ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు మరియు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మరియు గేమింగ్ ప్లాట్ఫారమ్లను ప్రదర్శించే ఇంటరాక్టివ్ జోన్ అయిన అలియన్జ్ ఇ-విలేజ్ తో సహా అనేక రకాల వినోద కార్యకలాపాలు కూడా ఉన్నాయి.