హైదరాబాద్, ఆట ప్రతినిధి: మూడు వారాలుగా తెలుగు రాష్ర్టాల అభిమానులను అలరించిన అరంగేట్ర టీజీ20 లీగ్లో తొలి సీజన్ విజేతగా హైదరాబాద్ ఈ-చాంపియన్స్ నిలిచింది. ఆదివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఏకపక్ష పోరులో హైదరాబాద్.. 6 వికెట్ల తేడాతో ఖమ్మం ఏసెస్ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన హైదరాబాద్.. క్వాలిఫయర్-1లో తమకు ఎదురైన పరాభవానికి ఫైనల్లో బదులు తీర్చుకుంది. మొదట హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో ఖమ్మం 20 ఓవర్లకు 157/8కే పరిమితమైంది. మికిల్ జైస్వాల్ (39 బంతుల్లో 65, 4 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్. యశ్వీర్ (3/17) మూడు వికెట్లతో చెలరేగగా దేవ్ మెహతా, అజయ్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో కెప్టెన్ అభిరథ్ రెడ్డి (30 బంతుల్లో 48, 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులకు తోడు వైష్ణవ్ (41 నాటౌట్), షణ్ముఖ (36) రాణించి హైదరాబాద్కు ఘనవిజయాన్ని అందించారు.
ఫైనల్లో మూడు వికెట్లు తీసి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించిన యశ్వీర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా సీజన్లో 10 మ్యాచ్లాడి 541 పరుగులు చేసిన సారథి అభిరథ్కు ఆరెంజ్ క్యాప్తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా వరించింది. అజయ్ దేవ్ (21 వికెట్లు) పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఫైనల్కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. టైటిల్ పోరును ప్రత్యక్షంగా చూసేందుకు ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ స్థాయిలో సుమారు 33 వేల మంది ప్రేక్షకులు హాజరవడం విశేషం. ఫైనల్ ఆరంభానికి ముందు సినీనటుడు, ఈ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ స్టేడియంలో సందడి చేయగా ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో ఉర్రూతలూగించాడు. కాగా మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహణ లోపం మరోసారి బట్టబయలైంది. ఖమ్మం ఇన్నింగ్స్ సాగుతుండగా సౌత్ పెవిలియన్ వద్ద జనరేటర్లు పనిచేయక ఫ్లడ్లైట్ వెలుగలేదు. దీంతో సుమారు అరగంట ఆట నిలిచిపోవడం గమనార్హం.