హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. సంస్కరణల తర్వాత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్షణలో పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ సాగుతున్నది. ఈ నెల 20వ తేదీన ఎన్నికలు జరుగనుండగా, శుక్రవారంతో నామినేషన్ల పర్వానికి తెరపడింది. యూనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ తరఫున అర్సనపల్లి జగన్మోహన్రావు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే తన చాతుర్యంతో జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఐఏ)లో వివాదాలకు ముగింపు పలికిన జగన్ తాజాగా హెచ్సీఏ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గత కొన్నేండ్లుగా హెచ్సీఏలో నెలకొన్న అవినీతి, అక్రమాలను రూపుమాపేందుకు కచ్చితమైన విజన్తో ముందుకు వచ్చారు. ప్యానెల్లో జగన్తో పాటు శ్రీధర్(ఉపాధ్యక్షుడు), హరినారాయణ(కార్యదర్శి), నోయల్ డేవిడ్(సంయుక్త కార్యదర్శి), శ్రీనివాస్(కోశాధికారి), అహ్మద్ఖాన్(కౌన్సిలర్) పోటీపడుతున్నారు. శనివారం నామినేషన్ల స్క్రూటినీ జరుగనుండగా, నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 16తో ముగియనుంది.