హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే భారత్ పతకాల సంఖ్య 91 కి చేరింది. అందులో 21 స్వర్ణాలు, 33 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. వివిధ క్రీడాంశాల్లో మరో 9 పతకాలు ఖాయమయ్యాయి. దాంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో వంద పతకాలు చేరనున్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ ఏకంగా 100 పతకాలు సాధించడం ఇదే తొలిసారి కాబోతోంది.
కాగా, సెప్టెంబర్ 24న ప్రారంభమైన ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఆది నుంచి గతం కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రోజు నుంచి భారత పతకాల జోరు కొనసాగుతున్నది. దాంతో ఆసియాడ్ చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు భారత్ ఖాతాలో 100 పతకాలు చేరబోతున్నాయి. గతంలో 2018 ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన 70 పతకాలే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఇప్పటికే ఆ రికార్డు బద్దలు కాగా, ఇప్పుడు ఏకంగా 100 పతకాల మార్కు దిశగా భారత్ దూసుకుపోతున్నది.