పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ జోరు కొనసాగుతున్నది. వరుస విజయాలతో ఇప్పటికే టేబుల్ టాపర్గా ఉన్న హైదరాబాద్.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో 3-2తో ఒడిశా ఎఫ్సీని చిత్తు చేసింది. హైదరాబాద్ తరఫున చైనెసె (51వ నిమిషంలో), విక్టర్ (70వ ని.లో), ఆకాశ్ మిశ్రా (73వ ని.లో) ఒక్కో గోల్ సాధించగా.. ఒడిశా తరఫున జెర్రీ మావిమింగ్తంగా (45వ ని.లో), జొనాథస్ (84వ ని.లో) చెరో గోల్ కొట్టారు. హాఫ్ టైమ్ వరకు వెనుకబడిపోయిన హైదరాబాద్.. ఆ తర్వాత వరుస గోల్స్తో విజృంభిస్తే.. ఆరంభంలో దూకుడు కనబర్చిన ఒడిశా.. రెండో అర్ధభాగంలో చేతులెత్తేసింది. తాజా సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లాడిన హైదరాబాద్ 6 విజయాలు, 5 ‘డ్రా’లు, రెండు పరాజయాలతో 23 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో టాప్లో ఉండగా.. కేరళ బ్లాస్టర్స్ (20 పాయింట్లు), జంషెడ్పూర్ (19 పాయింట్లు) ఆ తర్వాత వరుసగా ద్వితీయ తృతీయ స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఒడిశా (17 పాయింట్లు) ఏడో ప్లేస్లో ఉంది. మ్యాచ్ విషయానికి వస్తే.. జెర్రీ గోల్తో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఒడిశా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. హాఫ్ టైమ్ తర్వాత 20 నిమిషాల వ్యవధిలో మనవాళ్లు మూడు గోల్స్తో విజృంభించారు. పూర్తి సమయంలో హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్పైకి 19 సార్లు దాడి చేయగా.. ఒడిశా ఏడింటితోనే సరిపెట్టుకుంది. శుక్రవారం జరుగనున్న పోరులో గోవా ఫుట్బాల్ క్లబ్తో జంషెడ్పూర్ తలపడనుంది.