టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ పై అతడి సారథ్యంలోనే ఆడుతూ వెలుగు వెలిగిన హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను బాగా ఆడటం వల్లే గంగూలీ బతికిపోయాడని.. లేకుంటే కెప్టెన్సీ కోల్పోయేవాడని వ్యాఖ్యానించాడు.
తాజాగా ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ..‘ఒకవేళ గంగూలీ నాకు మద్దతు ఇచ్చి ఉండకుంటే అతడు ఆ సిరీస్ (2001 లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు సిరీస్) గెలిచుండేవాడు కాదు. అది గెలవకుంటే దాదా టీమిండియా కెప్టెన్సీ కూడా కోల్పోయేవాడు. గంగూలీ నా కెరీర్ కు దేవుడి వంటి వాడు. నా చేయి పట్టుకుని నన్ను నడిపించాడు..
నా కెరీర్ కు దాదా ఎంతో సాయం చేశాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడల్లా నాకు మద్దతుగా నిలిచాడు. క్రమం తప్పకుండా అవకాశాలిచ్చాడు. అయితే ఎన్ని అవకాశాలిచ్చినా నిరూపించుకోవాల్సింది మనమే కదా.. లేకుంటే ఏ కెప్టెన్ కూడా మిమ్మల్ని రక్షించలేడు..’అని భజ్జీ తెలిపాడు.
2001లో ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. ముంబైలో జరిగిన తొలి టెస్టులో గంగూలీ సేన దారుణంగా ఓడింది. కానీ కోల్కతా టెస్టులో పుంజుకుని విజయాన్ని సాధించింది. ఆ తర్వాత చెన్నై టెస్ట్ లోనూ గెలిచి సిరీస్ ను 2-1 తో నిలబెట్టుకుంది. ఈ సిరీస్ లో భజ్జీ ఏకంగా 3 టెస్టులలో 32 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ తర్వాత భజ్జీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఇంకా భజ్జీ మాట్లాడుతూ.. 2007 వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఓటమికి అప్పటి కోచ్ గ్రెగ్ ఛాపెల్ కారణమని అన్నాడు. అతడు కోచ్ గా లేకుంటే భారత జట్టు మరింత భాగా ఆడి ఉండేదని చెప్పాడు. ‘ఒకవేళ గ్రెగ్ చాపెల్ టీమిండియా కోచ్ గా ఉండకుంటే వెస్టిండీస్ లో జరిగిన 2007 ప్రపంచకప్ లో భారత జట్టు ప్రదర్శన మెరుగ్గా ఉండేది. అతడు హెడ్ కోచ్ గా ఉన్నంతకాలం భారత జట్టులో ఏ ఒక్క ఆటగాడు కూడా సంతోషంగా లేడు..’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. 2007 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే వైదొలిగింది. బంగ్లాదేశ్, శ్రీలంకల మీద ఓడి ఇంటి దారి పట్టింది.