రీఎంట్రీలో అదరగొడుతున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. తాను సాధించాలనుకున్న లక్ష్యమేమిటో తనకు గతంలోనే చెప్పాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ను తిరిగి భారత్ కు తీసుకురావాలని అతడు టార్గెట్ గా పెట్టుకున్నాడని సన్నీ చెప్పాడు. కార్తీక్ తో కలిసి కామెంట్రీ చెప్పినప్పుడు అతడితో పంచుకున్న విషయాలను సన్నీ తాజాగా వెల్లడించాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో కామెంట్రీ చెప్పడానికి వెళ్లినప్పుడు కలిసే భోజనం చేసేవాళ్లం. చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అప్పుడతడు తాను ఏం సాధించాలనుకుంటున్నానో నాతో చెప్పాడు. 2007లో టీమిండియా నెగ్గిన తొలి టీ20 ప్రపంచకప్ ను తిరిగి భారత్ కు తీసుకురావడమే తన లక్ష్యమని కార్తీక్ నాతో అన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ గతేడాది దుబాయ్ లో జరిగిన పొట్టి ప్రపంచకప్ కు అతడు ఎంపిక కాలేదు.. కానీ ఈసారి మాత్రం కార్తీక్ మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)కు తప్పకుండా వెళ్తాడు’ అని అన్నాడు.
ఫినిషర్ గా వచ్చే కార్తీక్.. తాను 6, 7 స్థానాలలో బ్యాటింగ్ చేయడానికి ఎంతగానో ప్రాక్టీస్ చేశాడని, ఆ మేరకు తనను తాను సిద్ధం చేసుకున్నాడని గవాస్కర్ వివరించాడు. ‘సాధారణంగా టీ20లలో 6, 7 స్థానాలలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చే వాళ్లు 20 ఓవర్లు ఆడటం కుదరదు. 15 ఓవర్లు కూడా వాళ్లు ఆడలేరు. వారికి వచ్చేవే మహా అయితే చివరి ఐదు ఓవర్లు. ఆ మేరకు కార్తీక్ కూడా తనను తాను మలుచుకున్నాడు. తన ఆలోచనా విధానంలో మార్పులు చేసుకుని.. ప్రణాళికబద్దంగా ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు కనిపిస్తున్న ఫలితాలు అతడు గతంలో చేసిన హార్డ్ వర్క్ కు దక్కుతున్న ఫలాలు..’ అని తెలిపాడు.
ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో కేకేఆర్ కార్తీక్ ను రిటైన్ చేసుకోకపోవడంతో అతడు వేలంలోకి వెళ్లాడు. వేలంలో అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించడంతో అతడికి మళ్లీ టీమిండియాలో చోటు దక్కింది. ఇక లేటు వయసులో వచ్చిన అవకాశాన్ని కార్తీక్ రెండు చేతులా సద్వనియోగం చేసుకున్నాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లో రిషభ్ పంత్ కంటే దినేశ్ కార్తీకే ఫస్ట్ ఛాయిస్ గా కనబడుతుండటం విశేషం.