సుమారు మూడేండ్లుగా సెంచరీ చేయలేక ఇబ్బందులు పడుతూ క్రమంగా ఫామ్ కోల్పోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఇప్పటికైనా కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది అతడికి సూచిస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ మాత్రం కోహ్లికి విశ్రాంతికంటే దేశవాళీలో ఆడటం ముఖ్యమని.. అక్కడికెళ్తే అతడు తిరిగి ఫామ్లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘కోహ్లి తన ఫామ్ అందుకోవడానికి తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడాలి. అక్కడ పరుగులు సాధించాలి. డొమెస్టిక్ క్రికెట్ లో బౌలింగ్ ఏ స్థాయిలో ఉన్నా ఫర్వాలేదు. కానీ అది కోహ్లి తన లయను అందుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. తద్వారా అతడి మైండ్ సెట్ కూడా భారీ స్కోర్లు చేయాలనే దిశగా పనిచేయడం ప్రారంభిస్తుంది..
ఒకసారి కోహ్లి తన కాన్ఫిడెన్స్ ను తిరిగి పొందాడంటే ఇక అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు. ప్రత్యర్థి ఎవరు..? పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనేది సంబంధమే లేదు. ఆటోమేటిక్ గా అతడు పరుగులు చేయడం ప్రారంభిస్తాడు..’ అని తెలిపాడు.
గత కొంతకాలంగా కోహ్లి బ్యాటింగ్ తో పాటు టెక్నిక్ లో కొన్ని లోపాలున్నాయని వాటిని సరిదిద్దుకోవాలని మిస్బా సూచించాడు. ‘కొద్దికాలంగా కోహ్లి ఆటను చూస్తే అతడు ఎక్కువగా ఆఫ్ స్టంప్ కు ఆవలగా వెళ్తున్న బంతులను వెంటాడుతూ ఔట్ అవుతున్నాడు. అంతేగాక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కోహ్లి బౌలర్లను డామినేట్ చేయాలనుకుంటున్నాడు. కానీ అది కొన్నిసార్లు అతడికే ముప్పు తీసుకొస్తున్నది. అదీగాక కోహ్లి చాలా ఒత్తిడికి గురవుతున్నాడు..’ అని మిస్బా వెల్లడించాడు.