గాయంతో పాటు ఫామ్ కోల్పోయి కొంతకాలం విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా వచ్చే వన్డే ప్రపంచకప్ అనంతరం రిటైర్ అవుతాడని టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ వన్డేల నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఆ బాటలో నడవడానికి మరికొంతమంది సిద్ధంగా ఉన్నారని శాస్త్రి అంచనా వేశాడు.
ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘టెస్టు క్రికెట్ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ సుదీర్ఘ ఫార్మాట్ను ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే ఆటగాళ్లు మాత్రం ఇప్పుడు వాళ్లు ఏ ఫార్మాట్ ఆడాలో నిర్ణయించుకుంటున్నారు. మీరు హార్ధిక్ పాండ్యాను తీసుకోండి. అతడు టీ20లు ఆడాలని బలంగా నిశ్చయించుకున్నాడు. దానిమీద అతడికి స్పష్టమైన అవగాహన ఉంది..
పాండ్యా ఇప్పుడు వన్డే క్రికెట్ కూడా ఆడుతున్నాడు. ఎందుకంటే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉంది. అది ముగిసిన తర్వాత అతడు 50 ఓవర్ల ఫార్మాట్కు గుడ్ బై చెప్పే అవకాశముంది. మిగిలిన వారి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్లకు ఆ స్వేచ్ఛ (ఏ ఫార్మాట్ ఆడాలనేదానిపై) ఉంది..’ అని తెలిపాడు.
ఇక ద్వైపాక్షిక సిరీస్లకు కాలం చెల్లిందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ఊపందుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్లకు అంతగా ప్రాధాన్యం లేదని తెలిపాడు. అంతేగాక ఆటగాళ్లు సైతం తమకు నచ్చిన ఫ్రాంచైజీని ఎంచుకుని ఆడే విధానాన్ని ఎవరూ అడ్డుకోలేరని శాస్త్రి అన్నాడు.