హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చుకుని ఆటను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పటికే అంతర్గత రాజకీయాలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) పరువు గంగలో కలువగా, మ్యాచ్ నిర్వహణ విషయంలోనూ కార్యవర్గ సభ్యుల అనాలోచిత నిర్ణయాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. మరికొన్ని గంట ల్లో మ్యాచ్కు తెరలేవబోతుండగా హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్పై కార్యదర్శి విజయానంద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ను సాఫీగా నిర్వహించాల్సిన పాలకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న వైనం హెచ్సీఏ పరిస్థితికి అద్దం పడుతున్నది.
ఒకరిపై ఒకరు బురుద జల్లుకునే ప్రయత్నంలో వ్యక్తిగత ఆరోపణలకు దిగడం హెచ్సీఏ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా మారింది. మ్యాచ్ నిర్వహణ విషయంలో తమ వర్గాన్ని అజారుద్దీన్ పట్టించుకోవడం లేదం టూ విజయానంద్ విమర్శలకు దిగాడు. ‘భారత్, కివీస్ వన్డే మ్యాచ్ కోసం స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్ల విషయంలో అజర్ నన్ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అజర్ అతని టీమ్ మ్యాచ్ ఏర్పాట్లు చూసుకుంటూ మిగతావారికి ఎలాంటి అవకాశం ఇస్తలేరు. కీలక విషయాల్లో నాతో కనీసం మాట్లాడకుండా ఒంటెద్దు పోకడలతో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కార్యదర్శి హోదాలో నాకం టూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి.
అధ్యక్షుడిగా అజర్కు ఎలాంటి అర్హత లేకపోయినా.. అన్నింట్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడు. కోర్టు ఆదేశాల ప్రకారం చెక్లపై నేను సంతకాలు చేయాలి. కానీ వారి అవసరాలకు తగ్గట్లు బలవంతంగా నాతో సంతకాలు పెట్టించుకున్నారు. ఏ విషయంలోనూ నన్ను పట్టించుకోవడం లేదు. నేను దళితుడు అన్న కారణంతోనే అజర్ ఇలా చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించిన అనుభవం నాకు చాలా ఉంది. కానీ భారత్, కివీస్ వన్డేపై ఇప్పటి వరకు నన్ను అడుగలేదు. కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఆన్లైన్ టిక్కెట్ల విక్రయంలోనూ గోల్మాల్ జరిగినట్లు తెలుస్తున్నది. కార్యదర్శిగా ఒక రకంగా నన్నే కాదు..నా ప్యానెల్ మొత్తాన్ని అజర్ కావాలని పక్కకు పెట్టాడు’ అని పేర్కొన్నాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) పరువు నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. నిండా మునిగిన తర్వాత చలి ఏందన్నట్లు హెచ్సీఏ పాలకవర్గ సభ్యుల అవినీతి పరాకాష్టకు చేరింది. భారత్, న్యూజిలాండ్ వన్డే టిక్కెట్ల అమ్మకాల విషయంలోనూ హెచ్సీఏ పెద్దలు గోల్మాల్ చేసినట్లు తెలుస్తున్నది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ ఓవైపు ఆన్లైన్లో అభిమానులకు అందుబాటులో ఉంచామని చెప్పినా.. వేల టిక్కెట్లు ఎప్పుడు అమ్ముడుపోయాయో తెలియని సంకట స్థితిలో అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు. రూ.850 నుంచి 20,650 వరకు టిక్కెట్ల ధరలను నిర్ణయించగా, దశలవారీగా ఆన్లైన్లో ఉంచారు. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవాలని సూచించారు. దీంతో సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన అభిమానులు మ్యాచ్ కోసం ఆదరబాదరగా నగరానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు తొమ్మిది వేల కాంప్లిమెంటరీ పాస్లు ఉన్నాయన్న అధ్యక్షుడు అజర్ అవి ఎవరికి కేటాయించారో చెప్పకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. వెహికిల్ పాస్ల విషయంలోనూ హెచ్సీఏ సభ్యులు మీడియా ప్రతినిధుల ఓపికతో ఆటాడుకున్న వైనం స్టేడియంలో కనిపించడం పరిస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది.