టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్ను ఎలా నెగ్గాలనేదానిపై కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా అతడు తన మాజీ సహచర ఆటగాడు, స్నేహితుడు ప్రజ్ఞాన్ ఓజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు క్రికెట్ నుంచి తప్పుకున్నాక కామెంట్రీ చేస్తున్నాడనే విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.
విండీస్తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు.. శిఖర్-రోహిత్ల గురించి టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ జట్టులో ధావన్ ఉంటే బాగుంటుందని అందుకే బహుశా అతడికి అవకాశాలు వస్తున్నాయిని చెప్పిన ఓజా.. ధావన్ వంటి సీనియర్ ఆటగాడు జట్టులో ఉండాలని రోహిత్ కోరుకుంటున్నాడని అన్నాడు. సచిన్-గంగూలీల మాదిరిగా ఆటలోనే కాకుండా ఆఫ్ ది ఫీల్డ్లో సైతం శిఖర్-రోహిత్ మధ్య ఫ్రెండ్షిప్ ఉందని ఓజా తెలిపాడు.
తాజాగా బీసీసీఐ టీవీ ప్రతినిదులలో ఒకరు ఇదే విషయమై రోహిత్ శర్మ దగ్గర ప్రస్తావించారు. ఓజా వ్యాఖ్యలపై హిట్మ్యాన్ స్పందిస్తూ.. ‘అవునా..? ఓజా ఇప్పుడు కామెంటేటర్గా మారాడా..? సరే మంచిది. ఏదేమైనా సరే మనతో కలిసి బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరైనా వాళ్లతో పరస్పర అవగాహనతో ముందుకెళ్తాం. అది శిఖర్, నేను కావొచ్చు. మరే ఇద్దరూ కావచ్చు. ఆన్ ది ఫీల్డ్తో పాటు ఆఫ్ ది ఫీల్డ్లో కూడా ఆ బంధం కొనసాగుతుంది..’ అని అన్నాడు. ప్రజ్ఞాన్, రోహిత్లు భారత జట్టుతో పాటు ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే.