న్యూఢిల్లీ: వయసు మీద పడుతున్నా కొద్ది.. రోగాలతో సతమతమయ్యే వారు కొందరైతే.. అది పెద్ద విషయమే కాదన్నట్లు తమకు ఇష్టమైన రంగాల్లో సత్తాచాటేవారు మరికొందరు. హర్యానాకు చెందిన రాంబాయి రెండో కోవకు చెందుతారు. 105 ఏండ్ల వయసులో వడోదరలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పోటీపడ్డ రాంబాయి.. 100 మీటర్ల రేసును 45.40 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకం కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో మాస్టర్స్ విభాగంలో మన్ కౌర్ (74 సె.) పేరిట ఉన్న రికార్డును రాంబాయి బద్దలు కొట్టారు. దీంతో పాటు 200 మీటర్ల పరుగులోనూ రాంబాయి బంగారు పతకం కైవసం చేసుకున్నారు.