నయీంనగర్, ఫిబ్రవరి 25: రాష్ట్ర స్థాయి బాలుర అండర్-18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 100 మీటర్ల పరుగులో హర్షవర్ధన్ చాంపియన్గా నిలిచాడు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 9వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్-2023 పోటీలు శనివారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, డబుల్ ఒలింపియన్ జేజే శోభ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. బాలుర 400 మీటర్ల పరుగులో అజారుద్దీన్, 1500 మీటర్ల విభాగంలో రఘునాథ్ విజేతలుగా నిలిచారు. బాలికల అండర్-18 విభాగంలో శృతి తొలి స్థానం దక్కించుకుంది. 400 మీటర్ల విభాగంలో సింధు చాంపియన్గా నిలిచింది.