హైదరాబాద్, ఆట ప్రతినిధి: హ్యాండ్బాల్ ఫెడరేషన్ కప్ ట్రోఫీని పురుషుల విభాగంలో భారత రైల్వేస్ జట్టు, మహిళల కేటగిరీలో రాజస్థాన్ జట్లు కైవసం చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన పురుషుల ఫైనల్లో రైల్వేస్ 35-25తో సర్వీసెస్పై అద్భుత విజయం సాధించింది. మహిళల తుదిపోరులో రాజస్థాన్ 22-21తో హర్యానాపై ఉత్కంఠ విజయం సొంతం చేసుకుంది. పోటీల ముగింపు కార్యక్రమానికి జాతీయ హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఏఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒలింపిక్ క్రీడ అయిన హ్యాండ్బాల్కు దేశంలో ఆదరణ అంతకంతకు పెరుగుతున్నది. గతేడాది హైదరాబాద్లో ఆసియా క్లబ్ చాంపియన్షిప్ను విజయవంతంగా నిర్వహించాం. భవిష్యత్లో భారత్ వేదికగా మరిన్ని టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ)మాజీ కోశాధికారి ఆనందీశ్వర్పాండే పాల్గొన్నారు.