Gurcharan Singh : భారత క్రికెట్ చరిత్రలో 1983 సువర్ణాధ్యాయం. కపిల్ దేవ్ సారథ్యలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ను ఓడించి వన్డే వరల్డ్ కప్ ముద్దాడింది ఆ సంవత్సరమే. అయితే.. భారత్కు తొలి ఐసీసీ కప్పు అందించిన కపిల్ దేవ్ను నేను తీర్చిదిద్దానని ఇప్పటికీ చెప్పుకోను అని లెజెండరీ కోచ్ గురుచరణ్ సింగ్ అన్నాడు. అంతేకాదు కోచ్లు తమ శిష్యుల విజయాన్ని తమ గొప్పగా చెప్పుకోవద్దని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్ కోచ్లు తమ విలువలకు కట్టుబడి ఉండాలి. ఆటగాళ్లు శిక్షణ శిబిరాలకు హాజరైనంత మాత్రాన, వాళ్ల విజయానికి కారణం మేమే అని చెప్పుకోవద్దు. కపిల్ దేవ్ ముంబైలో నా కోచింగ్ క్యాంప్స్కు వచ్చేవాడు. అలాగని అతడు నా శిష్యుడిగా ఇప్పటికీ ఎక్కడా చెప్పుకోను. అతను ఛండీగఢ్ ప్లేయర్. కోచ్ దేశ్ ప్రేమ్ ఆజాద్ తీర్చిదిద్దిన క్రికెటర్’ అని గురుచరణ్ వెల్లడించాడు.
అజయ్ జడేజా నుంచి…
భారత్కు ఆడిన చాలామంది క్రికెటర్లకు గురుచరణ్ మెలకువలు చెప్పారు. అజయ్ జడేజా, మురళి కార్తిక్, కీర్తి ఆజాద్, మనిందర్ సింగ్.. వీళ్లంతా గురుచరణ్ దగ్గర క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నవాళ్లే. గురుచరణ్ను అందరూ ముద్దుగా గురుచి సర్ అని పిలుస్తారు. పాటియాలా మహారాజు యదవింద్ర సింగ్ దగ్గర గురుచరణ్ క్రికెట్ పాఠాలు ఒంటబట్టిచ్చుకున్నాడు. ఆ తర్వాత పాటియాలా, పంజాయ్ స్టేట్ యూనియన్, రైల్వేస్కు ఆడాడు. కోచ్ అవతారం ఎత్తడానికి ముందు ఆయన 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. భారత క్రికెట్కు విశేష సేవలు అందించనందుకు ఆయన ఈమధ్యే పద్మ శ్రీ అవార్డు అందుకున్నాడు. దేశ్ ప్రేమ్ ఆజాద్ తర్వాత పద్మ శ్రీ అవార్డు అందుకున్న రెండో క్రికెట్ కోచ్గా గురుచరణ్ గుర్తింపు సాధించాడు.