తానాడిన ఐదు ఐపీఎల్ ఫైనల్స్లోనూ హార్దిక్ పాండ్యా విజేతగా నిలువడం విశేషం. ముంబై ఇండియన్స్ తరఫున ఆటగాడిగా నాలుగు టైటిల్స్ నెగ్గిన హార్దిక్.. గుజరాత్కు సారథిగా కప్పు కట్టబెట్టాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ 2016లో ట్రోఫీ గెలిచిన అనంతరం కొత్త జట్టు (గుజరాత్ టైటాన్స్) విజేతగా నిలువడం ఇదే తొలిసారి.
తొలి మ్యాచ్ నుంచే నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ బరిలోకి దిగిన మొదటి సీజన్లోనే విజేతగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంలో జరిగిన ఐపీఎల్-15వ సీజన్ పైనల్లో హార్దిక్ సేన.. రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసి సగర్వంగా కప్పును ముద్దాడింది. లక్ష మందికి పైగా ప్రేక్షకుల మధ్య సాగిన తుదిపోరు పూర్తి ఏకపక్షంగా సాగి అభిమానులను నిరాశ పరచగా.. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా జట్టుకు టైటిల్ అందించాడు. మొదట బంతితో నిప్పులు చెరిగిన ఈ ఆల్రౌండర్.. ఆనక బ్యాట్తో విలువైన పరుగులు చేయగా.. అతిరథమహారథులు విజేతలకు ట్రోఫీలు అందజేశారు!
అహ్మదాబాద్: అరంగేట్ర సీజన్లోనే అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్ టైటిల్ ఎగరేసుకువెళ్లింది. లీగ్ ఆరంభం నుంచే నిలకడైన ఆటతీరు కనబర్చిన హార్దిక్ సేన సొంతగడ్డపై లక్ష మందికి పైగా అభిమానుల మధ్య జరిగిన పోరులో దుమ్మురేపింది. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసి ఐపీఎల్లో ఏడో చాంపియన్గా అవతరించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. తాజా సీజన్లో నాలుగు శతకాలతో జోరు మీదున్న స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలువగా.. యశస్వి జైస్వాల్ (22) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (14), దేవదత్ పడిక్కల్ (2), హెట్మైర్ (11), అశ్విన్ (6), పరాగ్ (15) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, సాయికిషోర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (5), మాథ్యూ వేడ్ (8) విఫలమైనా.. శుభ్మన్ గిల్ (45 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), హార్దిక్ పాండ్యా (34; 3 ఫోర్లు, ఒక సిక్సర్), డెవిడ్ మిల్లర్ (32 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకోవడంతో గుజరాత్ ఆడుతూ పాడుతూ మ్యాచ్ ముగించింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఒక వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ బ్యాటింగ్ను కకావికలం చేసిన హార్దిక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గతిలేని పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. బట్లర్ చివరి వరకు నిలువడంతో శాంసన్ సేన మంచి స్కోరే చేసినా.. బౌలర్లకు పెద్దగా సహకారం లభించని ఈడెన్ గార్డెన్ పిచ్పై గుజరాత్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మిల్లర్, హార్దిక్, వేడ్, గిల్ తలా కొన్ని పరుగులు చేయడంతో టైటాన్స్ దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. వారం తిరగక ముందే ఇరు జట్లు మరోసారి తలపడగా..ఈ సారి టాస్ రాజస్థాన్ను వరించింది. తొలుత బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్థిని కట్టడి చేయాల్సిందిపోయి.. మొదట బ్యాటింగ్కు దిగి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకున్నాడు. ఈ నిర్ణయం ఎంత తప్పో తెలిసిరావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తాజా సీజన్లో కెప్టెన్గా జట్టును ముందుండి నడిపిస్తున్న హార్దిక్.. బంతితో నిప్పులు చెరగడంతో రాయల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. జోష్లో ఉన్న బట్లర్, శాంసన్తో పాటు హార్డ్ హిట్టర్ హెట్మైర్ వికెట్లు పడగొట్టిన హార్దిక్.. రాజస్థాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తుదికంటా పోరాడినా.. శాంసన్ సేనకు నిరాశ తప్పలేదు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు ఓ మాదిరి ఆరంభం లభించింది. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై షమీ నిప్పులు చెరగగా.. తొలి ఓవర్లో అతడిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన జైస్వాల్.. మూడో ఓవర్లో 6,4తో ఆకట్టుకున్నాడు. యష్ దయాల్ బౌలింగ్లో సిక్సర్ బాదిన జైస్వాల్.. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో డీప్ స్కేర్ లెగ్లో సాయి కిషోర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫుల్ ఫామ్లో ఉన్న బట్లర్కు సారథి శాంసన్ తోడవడంతో రాయల్స్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత హార్దిక్ బంతినందుకోవడంతో మ్యాచ్ గమనమే మారిపోయింది. తొలి ఓవర్లోనే శాంసన్ను బుట్టలో వేసుకున్న హార్దిక్.. షార్ట్ పిచ్ బంతులతో రాయల్స్ ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో దేవదత్ పడిక్కల్ (2)ను రషీద్ ఔట్ చేయగా.. బట్లర్ వికెట్తో హార్దిక్ సగం మ్యాచ్ను లాగేసుకున్నాడు. భుజాల ఎత్తులో వేసిన లైన్ బాల్ను థర్డ్మెన్ దిశలో తరలించాలనుకున్న బట్లర్.. కీపర్కు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఐపీఎల్ ముగింపు వేడుకల్లో భాగంగా బీసీసీఐ అతిపెద్ద జెర్సీని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్-15వ సీజన్ సందర్భంగా బోర్డు అరుదైన జెర్సీని రూపొందించింది. పది జట్ల లోగోలతో పాటు ఐపీఎల్ 15వ సీజన్ అనే అక్షరాలతో 66 మీటర్ల పొడవు, 42 మీటర్ల వెడల్పుతో రూపొందించిన ఈ జెర్సీ రికార్డుల్లోకి ఎక్కింది.
ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఏడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ముంబై (2013, 2015, 2017, 2019, 2020) ఐదుసార్లు టైటిల్ గెలుచుకోగా.. చెన్నై (2010, 2011, 2018, 2021) నాలుగుసార్లు విజేతగా నిలిచింది. కోల్కతా (2012, 2014) రెండు సార్లు చాంపియన్గా అవతరించగా.. సన్రైజర్స్ హైదరాబాద్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), డక్కన్ చార్జర్స్ (2009) ఒక్కోసారి కప్పు ఎగరేసుకెళ్లాయి.
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. బట్లర్ 863 పరుగులతో టాప్లో నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటే.. చాహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్ కైవసం చేసుకున్నాడు.
కరోనా కారణంగా గత రెండేండ్లుగా సంబురాలకు దూరంగా ఉన్న ఐపీఎల్ నిర్వాహకులు.. ఆదివారం జరిగిన 15వ సీజన్ ఫైనల్ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మ్యాచ్ ఆరంభానికి మూడు గంటల ముందు నుంచే అభిమానులు పెద్ద ఎత్తున మైదానానికి తరలిరాగా.. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తన డ్యాన్స్తో స్టేడియాన్ని హోరెత్తించాడు. బాలీవుడ్ పాటలతో పాటు.. ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’పాటకు అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. భారత క్రికెట్ చరిత్రను జ్ఞప్తికి తెచ్చేలా.. సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ నిర్వహించిన లైవ్ మ్యూజిక్ షో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఐపీఎల్ ఫైనల్స్లో ఇది (130/9) రెండో అత్యల్ప స్కోరు. 2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్తో జరిగిన తుదిపోరులో ముంబై 129 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని టైటిల్ గెలుచుకోవడం విశేషం.
తుదిపోరులో గుజరాత్ పేసర్ ఫెర్గూసన్ (157.3 కిమీ) ఈ సీజన్లో వేగవంతమైన బాల్ వేసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ఉమ్రాన్(157 కిమీ) రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ (863) నిలిచాడు. విరాట్ కోహ్లీ (973; 2016వ సీజన్) అగ్రస్థానంలో ఉన్నాడు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 130/9 (బట్లర్ 39, జైస్వాల్ 22; హార్దిక్ 3/17, కిషోర్ 2/20),
గుజరాత్: 18.1 ఓవర్లలో 133/3 (గిల్ 45*, హార్దిక్ 34; బౌల్ట్ 1/14, చాహల్ 1/20).
ప్రైజ్మనీ..
విజేతగుజరాత్ టైటాన్స్రూ. 20 కోట్లు
రన్నరప్రాజస్థాన్ రాయల్స్రూ. 13 కోట్లు
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. బట్లర్ 863 పరుగులతో టాప్లో నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటే.. చాహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్ కైవసం చేసుకున్నాడు.