న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్(Brij Bhushan) లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ కన్నాట్ పోలీసు స్టేషన్లో నమోదు అయిన ఎఫ్ఐఆర్ వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. మహిళా అథ్లెట్లను అసంబద్ధ రీతిలో తాకినట్లు బ్రిజ్పై ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అథ్లెట్ల శ్వాసను చెక్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆయన ఆ అథ్లెట్లను అనుచిత రీతిలో తడిమినట్లు ఆరోపణలు ఉన్నాయి. అథ్లెట్లను పరీక్షిస్తున్న సమయంలో సంబంధం లేని ప్రశ్నలు వేసినట్లు పేర్కొన్నారు. ఏదైనా టోర్నీ సమయంలో గాయపడితే, వారి ట్రీట్మెంట్ ఖర్చు భరించేందుకు తమ లైంగిక వాంఛలు తీర్చాలని కోరినట్లు కూడా బ్రిజ్పై ఆరోపణలు ఉన్నాయి. డైటీషియన్ కానీ కోచ్ కానీ ఆమోదం ఇవ్వనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.
ఓ మైనర్ అథ్లెట్ వక్షోజాలను తన చేతులతో తడిమినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అథ్లెట్ను వెంబడించినట్లు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సాక్షీ మాలిక్, వినేశ్ పోగట్తో పాటు ఇతర ఏడుమంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ బ్రిజ్ భూషణ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బుధవారం దీనిపై ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఒక్క ఆరోపణ ప్రూవ్ అయినా తాను ఉరివేసుకోనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
బ్రిజ్ నుంచి తప్పించుకునేందుకు మహిళా అథ్లెట్లు తమ రూమ్ల నుంచి అంతా గ్రూప్గా బయటకు వెళ్లేవారని, లేదంటే ఒంటర్ని చేసి అనుచిత ప్రశ్నలు వేసేవాడని బ్రిజ్పై ఆరోపించారు. రెజ్లింగ్ సమాఖ్య కార్యదర్శి వినోద్ తోమర్ కూడా వేధించినట్లు రెజ్లర్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రిజ్పై మొత్తం రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353, 354ఏ, 354డీ, 34 కింద ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మైనర్ అథ్లెట్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సోలోని సెక్షన్ 10 కింది కేసు రాశారు.