Graeme Smith : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఆదరణ. అభిమాన గణం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అవును.. దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో ఆడేందుకు అతడిని ఒప్పిస్తానని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అనడమే అందుకు నిదర్శనం. ‘దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో ఎం.ఎస్.ధోనిని ఆడించాలని మేము అనుకుంటున్నాం. కానీ, బీసీసీఐ అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో అతడి సేవలను ఉపయోగించుకోలేకపోతున్నాం’ అని సఫారీ టీమ్ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. ప్రస్తుతం స్మిత్ ఎస్ఏ టీ20 లీగ్ కమిషనర్గా ఉన్నాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. ‘ధోనీ లాంటి ఆటగాడు ఉంటే గేమ్ అద్భుతంగా సాగుతుంది. మేము పోటీతత్వ ఉండే క్రికెట్ లీగ్ నిర్వహించాలి అనుకుంటున్నాం. అందుకని ధోనీ వంటి ప్లేయర్ ఉంటే మా లీగ్ బలం పెరుగుతుంది. ఎందుకంటే.. అతను చాలా కాలంగా అద్భుతంగా ఆడుతూ జట్టును గెలిపిస్తున్నాడు. ధోనీ మా లీగ్లో ఆడడం మా అందరికి గర్వకారణం. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే నేను ధోనిని ఒప్పిస్తా’ అని ఈ మాజీ ఓపెనర్ వెల్లడించాడు.
బీసీసీఐతో సత్సంబంధాలు
బీసీసీఐతో తమ దేశ బోర్డుకు ఉన్న అనుబంధాన్ని స్మిత్ గుర్తు చేశాడు. మేము ఎల్లప్పుడూ బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఆ బోర్డుతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. గత కొంత కాలంగా వాళ్లు విజయవంతంగా ఐపీఎల్ను నిర్వహిస్తున్నారు అని ప్రస్తావించాడు. కూల్ కెప్టెన్ ధోనీ టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఐపీఎల్లోనూ అతని బెస్ట్ కెప్టెన్గా నిరూపించుకున్నాడు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. త్వరలోనే ఐపీఎల్ 2023 మొదలు కానుంది. దాంతో, ధోని ఈసారి సీఎస్కేకు కప్పు అందించాలనే పట్టుదలతో ఉన్నాడు.