ముంబై : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మొదట బంతితో తర్వాత బ్యాట్తో దుమ్మురేపిన ఆ జట్టు.. ముంబై వేదికగా పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ను చిత్తుగా ఓడించింది. ముందు బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 143 రన్స్కే పరిమితమైంది. దీప్తి శర్మ (35 బంతుల్లో 45 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్), డాటిన్ (37 బంతుల్లో 40 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగళూరు 12.1 ఓవర్లే అవసరమయ్యాయి. ఛేదనలో విధ్వంసకర బ్యాటర్ గ్రేస్ హారిస్ (40 బంతుల్లో 85, 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు తోడు కెప్టెన్ స్మృతి మంధాన (32 బంతుల్లో 47 నాటౌట్, 9 ఫోర్లు) ధనాధన్ మెరుపులతో ఆ జట్టు విజయం నల్లేరు పై నడకే అయింది. హారిస్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో యూపీకి ఇది వరుసగా రెండో ఓటమి.
స్వల్ప ఛేదనను హారిస్ తన విధ్వంసకర ఆటతో మరింత చిన్నదిగా మార్చేసింది. దీప్తి తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాదిన ఆమె.. క్రీజులో ఉన్నంతసేపు అదే దూకుడును కొనసాగించింది. శిఖా 3వ ఓవర్లో స్మృతి కూడా రెండు ఫోర్లు సాధించింది. డాటిన 6వ ఓవర్లో అయితే హారిస్.. 4, 6, 4, 6, 6, 4తో ఏకంగా 32 పరుగులు రాబట్టడమే గాక 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించింది. ఆమె దూకుడుతో ఆర్సీబీ.. 6 ఓవర్లకే 78/0తో నిలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. 48 బంతులకే బెంగళూరు వంద పరుగుల మార్కును దాటడం విశేషం. డబ్ల్యూపీఎల్లో ఒక జట్టు తక్కువ బంతుల్లోనే సెంచరీకి చేరువవడం ఇది మూడోసారి. ధాటిగా ఆడే క్రమంలో హారిస్ ఆ జట్టు విజయానికి 6 పరుగుల దూరంలో ఔట్ అయినా రిచా (4*), స్మృతి లాంఛనాన్ని పూర్తిచేశారు. 47 బంతులు మిగిలుండగానే బెంగళూరు విజయాన్ని అందుకోవడం విశేషం.
50/5.. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 8.2 ఓవర్లలో చేసిన స్కోరది. ఆ స్థితి నుంచి వారియర్స్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసిందంటే దానికి కారణం దీప్తి, డాటిన్ పోరాటమే. ఆరంభంలో బెల్, స్మిత్ నిప్పులు చెరిగే బౌలింగ్తో యూపీకి పరుగుల రాకే గగనమైంది. బెల్.. 5వ ఓవర్లో హర్లీన్ (11)ను ఔట్ చేయగా శ్రేయాంక 8వ ఓవర్లో లానింగ్ (14), ప్రమాదకర లిచ్ఫీల్డ్ (20)ను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బతీసింది. అదే ఊపులో డీ క్లెర్క్.. 9వ ఓవర్లో కిరణ్ (5), సెహ్రావత్ను బోల్తా కొట్టించింది. 8.2 ఓవర్లలో 50/5గా ఉన్న యూపీని దీప్తి, డాటిన్ ఆదుకుని అభేద్యమైన 6 వికెట్కు 70 బంతుల్లో 93 రన్స్ జోడించారు.
యూపీ: 20 ఓవర్లలో 143/5 (దీప్తి 45*, డాటిన్ 40*, క్లెర్క్ 2/28, శ్రేయాంక 2/50);
బెంగళూరు: 12.1 ఓవర్లలో 145/1 (గ్రేస్ 85, స్మృతి 47*, శిఖా 1/28)